ఢిల్లీలో రూ.73.50 పెరిగిన వంట గ్యాస్ ధర! సెప్టెంబర్ 1 నుంచే అమలు
దేశ రాజధాని న్యూఢిల్లీలో మరోసారి వంట గ్యాస్ సిలిండర్ ధరలు భగ్గుమన్నాయి.14.2 కేజీల సబ్సీడీ వంట గ్యాస్ సిలిండర్ పై ఆయిల్ కంపెనీలు గురువారం ఏకంగా 14 శాతం అంటే.. రూ.73.50 పెంచాయి.
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో మరోసారి వంట గ్యాస్ సిలిండర్ ధరలు భగ్గుమన్నాయి. 14.2 కేజీల సబ్సీడీ వంట గ్యాస్ సిలిండర్ పై ఆయిల్ కంపెనీలు గురువారం ఏకంగా 14 శాతం అంటే.. రూ.73.50 పెంచాయి. దీంతో ప్రస్తుతం ఒక సిలిండర్ ధర రూ.597.50 పైసలకు చేరింది. పెరిగిన ధర సెప్టెంబర్ 1 నుంచే.. అంటే ఈ రోజు నుంచే అమలులోకి రానుంది.
షాక్: ఇక నుండి ప్రతినెల రూ.4 గ్యాస్ ధర పెంపు
ఆగస్టు నెలలో 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.524 ఉండేది. ఇక నుంచి ప్రతి నెలా రూ.4 చొప్పున వంట గ్యాస్ సబ్సిడీ సిలిండర్ ధర పెరుగుతుందని ఆగస్టు నెలలోనే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు.
ఇలా గ్యాస్ సిలిండర్ ధర పెంచుకుంటూ.. వచ్చే మార్చి నెల నాటికి వంట గ్యాస్ పై ఇస్తున్న సబ్సిడీని పూర్తిగా ఎత్తేయాలనేది కేంద్రం ఆలోచన. ఈ మేరకు ఆయిల్ కంపెనీలను కోరినట్లుగా కూడా మంత్రి జూలై 31న రాత పూర్వకంగా లోక్ సభలో చెప్పారు.
కానీ ఈ మాట చెప్పిన నెల తరువాత గ్యాస్ సిలిండర్ ధరను ఆయిల్ కంపెనీలు ఏకంగా 14 శాతం మేర పెంచేయడం గమనార్హం. నిజానికి కేంద్ర ప్రభుత్వం గతంలోనే 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధరను ప్రతీ నెలా రూ.2 ( వ్యాట్ కలపకుండా) చొప్పున పెంచుకోమని ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం కంపెనీలకు సూచించింది. ఆ తరువాత దీనిని రూ.4కు పెంచింది.
దీంతో ఆయిల్ కంపెనీలు ఇప్పటికి రెండుసార్లు వంట గ్యాస్ సిలిండర్ ధరను పెంచాయి. జూలై 1న ఏకంగా రూ.32 పెంచేశాయి. అదేమంటే జీఎస్టీ ప్రభావం అని పేర్కొన్నాయి. ఇప్పుడు ఢిల్లీలో మరోసారి ఏకంగా రూ.73.50 పెంచేశాయి.
ప్రస్తుతం సబ్సీడి కింద ఏడాదికి 12 గ్యాస్ సిలిండర్లు తీసుకోవచ్చు. ఆ తర్వాత 13 వ సిలిండర్ నుండి మార్కెట్ ధరకే విక్రయిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్లు వినియోగించే కుటుంబాలు 18.11 కోట్లు ఉండగా, 2.66 కోట్ల మంది సబ్సిడీయేతర గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తున్నారు.