తొలిరోజే రచ్చ: క్వశ్చన్ అవర్ రద్దుపై విపక్షాల ఫైర్ - నిర్మలపై సౌగత్ అనుచితం - లోక్సభ రేపటికి వాయిదా
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజే లోక్ సభలో రచ్చ చెలరేగింది. ప్రశ్నోత్తరాలను(క్వశ్చన్ అవర్) రద్దు చేయడంపై విపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను ఉద్దేశించి తృణమూల్ ఎంపీ సౌగత్ రాయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సర్కారు మండిపడింది. ఈ గందరగోళంలోనే రెండు కీలక బిల్లులకు లోక్ సభ ఆమోదం తెలిపింది. దేశంలో కరోనా పరిస్థితిపై ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ బ్రీఫింగ్ ఇచ్చారు. అనంతరం స్పీకర్ ఓం బిర్లా సభను మంగళవారానికి వాయిదా వేశారు. వివరాల్లోకి వెళితే..
బీహార్ భగీరరథుడు లాంగి భూయాన్-ఒక్కడే 30 ఏళ్లు చమటోడ్చి,ఊరికి కాలువ-పిరమిడ్ కన్నా గొప్పది
కరోనా విలయం నేపథ్యంలో సోమవారం నుంచి ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో వినూత్న అంశాలెన్నో చోటుచేసుకున్నాయి. పార్లమెంట్ చరిత్రలోనే తొలిసారి నిలబడి కాకుండా.. ఎవరివారు సీట్లలో కూర్చొని మాట్లాడే విధానం అమలైంది. హాజరు పట్టికపై సంతకాలు చేయాల్సిన అవసరం లేకుండా.. ''అటెండెన్స్ రిజిస్టర్' యాప్ ద్వారా ఎంపీలు తమ హాజరును నమోదు చేసుకున్నారు. సభ ప్రారంభమైన వెంటనే చనిపోయిన ప్రముఖులకు నివాళులు అర్పించారు. కాసేపు వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభం కాగా క్వశ్చన్ అవర్ రద్దుపై ప్రతిపక్ష పార్టీలు నిరసన గళం వినిపించాయి.
ప్రశ్నోత్తర కాలాన్ని 'గోల్డెన్ అవర్'గా అభివర్ణిస్తూ.. అసలు క్వశ్చన్ అవర్ లేకుండా సభ నిర్వహించడం ఏమాత్రం సబబు కాదని కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి అన్నారు. ప్రశ్నోత్తరాల ఎత్తివేత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై దాడి లాంటిదేనని హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు. కాగా, ప్రత్యేక పరిస్థితుల్లో సమావేశాలు జరుగుతున్నందున క్వశ్చన్ అవర్ ఎత్తేశామని, ఈ విషయాన్ని అన్ని పార్టీల నేతలకు ముందే వివరించినా, ఆయా నేతలు సభ లోపల గొడవకు దిగడం ఏంటని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మండిపడ్డారు. అన్ని అంశాలపై చర్చకు, సమాధానాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఎట్టకేలకు ప్రశ్నోత్తరాలు ఉండబోవన్న తీర్మానం ఆమోదం పొందింది. అలాగే, నిధుల కోసం అనుబంధ డిమాండ్ మొదటి విడత రూ .2,35,852 కోట్ల అదనపు వ్యయం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు కూడా ఆమోదం లభించింది. అదనపు వ్యయం బిల్లు సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగత్ రాయ్.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యక్తిగత విషయాలపై కామెంట్ చేయడం సభలో దుమారం రేపింది. సీనియర్ సభ్యుడై ఉండి, ఒక మహిళ పట్ల అనుచితంగగా మాట్లాడటం సరికాదని పార్లమెంటరీ వ్యవహరాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయ్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ చెప్పడంతో వివాదం సర్దుమణిగింది.
కరోనా విలయంపై కేంద్రం కీలక ప్రకటన-లాక్డౌన్తో 78వేల ప్రాణాలు సేఫ్-లోక్ సభకు ఆరోగ్య మంత్రి బ్రీఫింగ్
Recommended Video
దేశంలో కొవిడ్ పరిస్థితులపై ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ లోక్ సభకు బ్రీఫింగ్ ఇచ్చారు. కేసులు ఎక్కువగా ఉన్న ఇతర దేశాలతో పోల్చుకుంటే భారత్ లో ఇన్ఫెక్షన్ వ్యాప్తి రేటు, మరణాల రేటు తక్కువగా ఉందని, ఇప్పటికే 77 శాతం మంది కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నారని తెలిపారు. సరైన సమయంలో దేశవ్యాప్త లాక్ డౌన్ విధించడం వల్ల 14 నుంచి 29 లక్షల కేసులుల్ని, 37వేల నుంచి 78 వేల మరణాలను నివారించగలిగామని మంత్రి అన్నారు. సభ ప్రారంభానికి ముందు పార్లమెంట్ ఆవరణలో ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడుతూ.. సరిహద్దుల్లో పహారా కాస్తున్న సైనికులకు దేశం యావత్తూ అండగా ఉందన్న భరోసా కల్పించేలా ఉభయసభలు వ్యవహరిస్తాయన్న నమ్మకం ఉందన్నారు.