ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేసిన లెఫ్టినెంట్ గవర్నర్.. కేజ్రీవాల్ టెర్రరిస్టు కాదని తేలిందన్న ఆప్
ఢిల్లీ ఏడవ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలవడటంతో ఆరో అసెంబ్లీని రద్దు చేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. ''ఢిల్లీ ఆరవ అసెంబ్లీని లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ రద్దు చేశారు''అని గవర్నర్ కార్యాలయం ఒక ప్రకనటలో తెలిపింది. ఎన్నికల పూర్తి ఫలితాలు వెల్లడైన తర్వాత తదుపరి అసెంబ్లీ ఏర్పాటుపై త్వరలోనే మరో ఉత్తర్వులు జారీ అవుతాయని ప్రకటనలో పేర్కొన్నారు.
ఊడ్చేసిన చీపురు..
మొత్తం 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(చీపురు గుర్తు) వరుసగా రెండోసారి రికార్డు మెజార్టీతో విజయఢంకా మోగించింది. మంగళవారం వెల్లడైన ఫలితాల్లో ఆ పార్టీ 62 సీట్లు కైవసం చేసుకోగా, బీజేపీ కేవలం 8 స్థానాలతో సరిపెట్టుకుంది. కాంగ్రెస్ సహా మిగతా పార్టీలేవీ కనీసం బోణీ కూడా చేయలేదు. ఓట్ల శాతంలోనూ ఆప్, బీజేపీలో డామినేట్ చేశాయి.
టెర్రరిస్టు కాదని నిరూపించారు..
ఎన్నికల ప్రచారంలో ఆప్ పై తీవ్రస్థాయి ఆరోపణలు చేసిన బీజేపీ నేతలు... ఒక దశలో సీఎం కేజ్రీవాల్ టెర్రరిస్టు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎంపీ పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ ఓ సభలో మాట్లాడుతూ.. సీఏఏ నిరసనల్ని సమర్థిస్తోన్న కేజ్రీవాల్ ముమ్మాటికీ టెర్రరిస్టేనని అన్నారు. కాగా, మంగళవారం వెల్లడైన ప్రజా తీర్పుతో కేజ్రీవాల్ టెర్రరిస్టు కాదని, స్వచ్ఛమైన దేశభక్తుడని తేలిందని ఆప్ కీలక నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు.
బీజేపీ శక్తినంతా వాడినా..
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తన శక్తినంతా ఉపయోగించి విద్వేషరాజకీయాలు చేసినా ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ కే పట్టం కట్టారని, తద్వారా ఆయన టెర్రరిస్టుకాదు.. తమ ముద్దుబిడ్డ అని జనం నిరూపించారని సంజయ్ సింగ్ తెలిపారు. మూడోసారి ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ఎప్పుడు ప్రమాణం చేస్తారనేది కొద్ది గంటల్లోనే వెల్లడిస్తామని ఆయన చెప్పారు.