భారత్ బంద్కు సంఘీభావం: లక్నోలో అఖిలేశ్ యాదవ్ నిరసన ప్రదర్శన, కేసు నమోదు
డిమాండ్ల సాధన కోసం రైతులు తలపెట్టిన భారత్ బంద్కు అన్నీ పక్షాల నుంచి మద్దతు లభిస్తోంది. మరికొన్ని గంటల్లో బంద్ ప్రారంభం కానుంది. అయితే రైతులకు మద్దతు తెలిపేందుకు ఉత్తరప్రదేశ్లో మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ముందుకొచ్చారు. ఎస్పీ శ్రేణులతో కలిసి ప్రదర్శన చేపట్టారు. అయితే దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 151 సీఆర్పీసీ కింద శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు.
188 ఎపిడమిక్ డిసిజ్ యాక్ట్ కింద అఖిలేశ్ యాదవ్పై కేసు నమోదు చేశామని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఇటు సోమవారం జార్ఖండ్ కాంగ్రెస్ విభాగం దీపాలతో భారత్ బంద్కు మద్దతు తెలిపారు. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న చోట నిరసనలు మిన్నంటగా.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆందోళన చేస్తే అడ్డుకుంటున్నారు. మరోవైపు రైతు నేతలు మాత్రం ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా తమ భారత్ బంద్ కొనసాగుతోందని స్పష్టంచేశారు.
భారత్ బంద్ దృష్ట్యా గుజరాత్లో 144 సెక్షన్ విధించారు. మంగళవారం రాష్ట్రంలో నలుగురు గుమికూడి ఉండొద్దు అని డీజీపీ ఆశిష్ భాటియా తెలిపారు. నలుగురి కంటే ఎక్కువ మంది ఉంటే చట్టపరమైన చర్య తీసుకుంటామని హెచ్చరించారు.
బంద్ ఉదయం 11 గంటలకు ప్రారంభం అవుతోందని భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేశ్ టికాయత్ తెలిపారు. దీంతో ఆఫీసులకు వెళ్లేవారు నిరభ్యరంతంగా వెళ్లొచ్చని చెప్పారు. మధ్యాహ్నం 3 గంటలకు బంద్ ముగిస్తామని వెల్లడించారు. ఆ సమయం వరకు చాలా కార్యాలయాలు విధుల్లో ఉంటాయని తెలిపారు. 3 తర్వాత అన్నీ యధావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. ఆ తర్వాత సాధారణంగా ఉండటంతో.. జనం బయట తిరగొచ్చు అని వెల్లడించారు.