కోవిహాల్ట్ను రూ. 49కే మార్కెట్లోకి తీసుకొస్తున్న లుపిన్
న్యూఢిల్లీ: ప్రముఖ ఫార్మా కంపెనీ లుపిన్ కరోనా ఔషధాన్ని మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. కరోనావైరస్ నుంచి ఉపశమనం కలిగిస్తుందని భావిస్తున్న యాంటీ వైరల్ ఔషధం ఫావిపిరవిర్ను 'కోవిహాల్ట్' పేరుతో మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు బుధవారం తెలిపింది.
తేలికపాటి నుంచి మధ్యస్థ కరోనా లక్షణాలతో బాధపడుతోన్న రోగుల చికిత్సలో వీటిని వాడొచ్చని తెలిపింది. భారత్లో ఒక్కో టాబ్లెట్ ధర రూ. 49గా ఉంటుందని వెల్లడించింది. ఇక షీట్లో 200 ఎంజీ మోతాదులో ఉన్న 10 టాబ్లెట్లు ఉంటాయని తెలిపింది.
అత్యవసర పరిస్థితుల్లో వినియోగించడానికి ఫావిపిరవిర్ ఔషధానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతి ఇచ్చిందని రెగ్యూలేటరీ ఫైలింగ్ లో లుపిన్ తెలిపింది.
తమ కంపెనీకున్న విస్తృత నెట్ వర్క్ ద్వారా కోవిహాల్ట్ అందరికీ అందుబాటులోకి తీసుకువస్తామని లుపిన్ అధ్యక్షుడు రాజీవ్ సిబల్ వెల్లడించారు. కాగా, ఆగస్టు 4న ఫావిపిరవిర్ ఔషధాన్ని దేశీయంగా ఫ్లూగార్డ్ పేరిట సన్ ఫార్మా పేరిట సన్ఫార్మా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఒక్కో టాబ్లెట్ ధరను రూ. 35గా నిర్ణయించింది ఈ కంపెనీ.