అపోలో ఆసుపత్రిలో చేరిన కరుణానిధి భార్య, తల్లి ఆశీర్వాదం తీసుకున్న స్టాలిన్, రాత్రి!
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత ఎం. కరుణానిధి సతీమణి దయాళ్ అమ్మాళ్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. మంగళవారం రాత్రి పొద్దపోయిన తరువాత అస్వస్తతకు గురైన దయాళ్ అమ్మాళ్ ను చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు.
మంగళవారం డీఎంకే పార్టీ అధ్యక్షుడిగా ఎంకే. స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. డీఎంకే అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఎంకే. స్టాలిన్ తన తండ్రి దివంగత నేత ఎం. కరుణానిధి సమాధి దగ్గరకు చేరుకుని ఆశీర్వాదం తీసుకున్నారు.
మెరీనా బీచ్ లోని కరుణానిధి సమాధి దగ్గర నుంచి నేరుగా ఇంటికి చేరుకున్న ఎంకే. స్టాలిన్ తల్లి దయాళ్ అమ్మాళ్ ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఎంకే. స్టాలిన్ డీఎంకే పార్టీ నాయకులు, కార్యక్రమాలతో బిజీ అయ్యారు.
మంగళవారం రాత్రి పొద్దుపోయిన తరువాత స్టాలిన్ తల్లి దయాళ్ అమ్మాళ్ అనారోగ్యానికి గురి కావడంతో ఆమెను అపోలో ఆసుపత్రికి తరలించారు. అపోలో ఆసుపత్రి దగ్గర కరుణానిధి కుటుంబ సభ్యులు, డీఎంకే పార్టీ సీనియర్ నేతలు ఉన్నారు. బుధవారం దయాళ్ అమ్మాళ్ హెల్త్ బులిటెన్ ను అపోలో ఆసుపత్రి వర్గాలు విడుదల చేసే అవకాశం ఉందని డీఎంకే పార్టీ నేతలు అంటున్నారు.