సభలో ఫోన్లతో వీడియోలు తీస్తారా? ఆ విషయం కూడా తెలియదా?: వెంకయ్య వార్నింగ్
న్యూఢిల్లీ: మంగళవారం నాటి రాజ్యసభ సమావేశానలను కొందరు సభ్యులు మొబైల్ ఫోన్లలో రికార్డు చేయడంపై ఛైర్మన్ ఎం వెంకయ్యనాయుడు బుధవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ఫోన్లు ఉపయోగించడం, వీడియోలు తీయడం నిబంధనలకు వ్యతిరేకమని, ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం సభను ధిక్కరించనట్లేనని మండిపడ్డారు.
మంగళవారం రాజ్యసభ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ఈ నేపథ్యంలో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. పలుమార్లు సభ వాయిదా పడింది. కాగా, సభలో ఆందోళనలు జరుగుతున్న దృశ్యాలను కొందరు సభ్యులు ఛాంబర్లో కూర్చుని తమ మొబైల్ ఫోన్లలో వీడియో తీశారు.
ఆ తర్వాత ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో మీడియా ఛానళ్లు కూడా ఆ వీడియోలను ప్రసారం చేశాయి. ఈ క్రమంలో సదరు సభ్యులపై రాజ్యసభ ఛైర్మన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభ ఛాంబర్లలో ఫోన్లు ఉపయోగించొద్దని పార్లమెంటరీ నిబంధనలు చెబుతున్నా.. నిన్న కొందరు సభ్యులు సభలో జరిగిన ఘటనలను తమ ఫోన్లలో రికార్డు చేశారన్నారు. ఇలాంటి ప్రవర్తన పార్లమెంటరీ గౌరవ మర్యాదలకు విరుద్ధమని వెంకయ్య స్పస్టం చేశారు.
ఈ నియమాల నుంచి సభ్యులకు ఎలాంటి మినహాయింపు లేదని, ఇలాంటి అనవసర వ్యవహారాలకు సభ్యులు దూరంగా ఉండాలన్నారు. అలా అనధికార రికార్డులు చేయడం, ఆ వీడియోలు సోషల్ మీడియాలో పెట్టడం సభను ధిక్కరించడమే అవుతుందని వెంకయ్యనాయుడు తేల్చి చెప్పారు.
ఎంపీలు పార్లమెంటరీ నియమ నిబంధనలను పాటించాలని, సభా మర్యాదలను కాపాడాలని రాజ్యసభ ఛైర్మన్ సభ్యులకు హితవు పలికారు. అంతేగాక, మీడియా ఛానళ్లు కూడా ఇలాంటి అనధికారిక వీడియోలను ప్రసారం చేయొద్దని సూచించారు. అదేంటే తదుపరి పర్యవసానాలు ఎదుర్కొవాల్సి వస్తుందని రాజ్యసభ ఛైర్మన్ వెంయ్యనాయుడు హెచ్చరించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పార్లమెంటులో ప్రతిపక్షాలు నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే.