ప్రియురాలి ప్రాణం తీసిన ఫేస్బుక్ వ్యసనం, నిందితుడు అరెస్ట్
చెన్నై: బాయ్ఫ్రెండ్స్తో నిత్యం టచ్లో ఉంటూ తనకు దూరం అవుతోందని అనుమానం పెంచుకున్న ఓ ప్రియుడు తన ప్రియురాలిని అంతం చేసిన సంఘటన చెన్నైలో జరిగింది. చెన్నైలోని వడపళనిలో నివాసం ఉంటున్న అంటోణి కుమార్తె గ్రేసీ షాలిని (21) హత్యకు గురైయ్యింది. ఇందుకు సంబంధించి కోడంబాకానికి చెందిన అబ్దుల్ రజాక్ అనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రేసీ షాలిని ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చదువుతోంది. షాలిని, అబ్దుల్ రజాక్లు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు వివాహం చేసుకొవాలని నిశ్చయించుకున్నారు.
షాలినికి ఫేస్బుక్, వాట్సప్ లో స్నేహితులతో టచ్లో ఉండేది. ఈ అలవాటు వ్యసనంగా మారింది. విషయం తెలుసుకున్న అబ్దుల్ రజాక్ మందలించాడు. దానిని గ్రేసీ పట్టించుకోలేదు.
ఆ తర్వాత ఆమె కొంతకాలం నుండి అబ్దుల్ రజాక్కు దూరంగా ఉంటోంది. తనను కాదని ఇంకొకరిని షాలిని వివాహం చేసుకుంటుందని అబ్దుల్ రజాక్ భావించాడు. ఇదే విషయంపై షాలినిని నిలదీశాడు. అలాంటిదేమీ లేదని నిన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అయితే అబ్దుల్ రజాక్కు అనుమానం మాత్రం రోజు రోజుకు పెరిగింది.
చెన్నైలోని తాంబరం సమీపంలోని పట్టిపై అరంబాకంలో అబ్దుల్ రజాక్ బంధువు నత్తం బీబీ అనే మహిళ నివాసం ఉంటున్నారు. ఈమె ఈ నెల 7వ తేదిన ఊరికి వెళ్తూ ఇంటి తాళం అబ్దుల్ రజాక్కు ఇచ్చింది. అదే రోజు సాయంత్రం కాలేజ్లో ఉన్న షాలినికి ఫోన్ చేసిన అబ్దుల్ రజాక్ తన బంధువు ఇంటి దగ్గరకు రావాలని చెప్పాడు.
ఇంటిలో ఇద్దరి మద్య ఫేస్బుక్, వాట్సాప్ వ్యవహారంలో గొడవ జరిగింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన అబ్దుల్ రజాక్ తాడుతో షాలిని గొంతు బిగించి హత్య చేశాడు. మృతదేహం ఇంటిలో పెట్టి బయట తాళం వేసి వెళ్లిపోయాడు. మంగళవారం సాయంత్రం ఊరి నుండి ఇంటికి వచ్చిన నత్తం బీబీ ఇంటిలో కుళ్లిన మృతదేహం ఉన్న విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు హంతకుడు అబ్దుల్ రజాక్ను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.