ఆ విలన్లను ఇలా చంపేశారు: అధికారులు
బెంగళూరు: శ్యాండిల్ వుడ్ విలన్లు అనీల్, ఉదయ్ చావుకు మాస్తిగుడి సినిమా యూనిట్ సభ్యుల నిర్లక్షమే కారణం అని తాము ఎంత చెప్పినా వారు పట్టించుకోలేదని జలమండలి అధికారులు ఆరోపించారు.
తాము ముందుగా సూచించిన సలహాలు గాలికి వదిలివేసి ఇష్టం వచ్చినట్లు షూటింగ్ చెయ్యడం వలనే ఇద్దరు అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని అధికారులు అంటున్నారు. భోజనం చెయ్యడానికి వెళ్లిన సమయంలో దర్శకుడు నియమాలు గాలికి వదిలి సినిమా షూటింగ్ మొదలు పెట్టారని జలమండలి అధికారులు పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చారు.
మొదట చేసింది ఇదే తప్పు
తిప్పగుండనహళ్ళి జలాశయం (చెరువు) పరిసర ప్రాంతాల్లో సినిమా షూటింగ్ లు చెయ్యాలంటే జలమండలి పలు షరతులు పెట్టింది. మేము చెప్పిన షరతులను మాస్తిగుడి సినిమా యూనిట్ సభ్యులు పాటించలేదని జలమండలి అధికారులు అంటున్నారు.
చెప్పినా వినలేదు అందుకే ?
నిషేధిత ప్రాంతాల్లో సినిమా షూటింగ్ జరపరాదని, అనుమతి ఇచ్చిన ప్రాంతంలో జాగ్రత్తగా సినిమా షూటింగ్ చేసుకోవాలని జలమండలి అధికారులు సూచించారు. సినిమా షూటింగ్ సమయంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకున్నా మాకు ఎలాంటి సంబంధం లేదని ముందే చెప్పామని జలమండలి అధికారులు అంటున్నారు.
బయటకు వెళ్లిన సమయంలో
తిప్పగూండనహళ్ళి జలాశయంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొన్ని ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు ఉన్నాయి. అయితే ఆ నియమాలు ఉల్లంఘించడం వలనే ఇద్దరు నటుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని జలమండలి అధికారులు ఆరోపిస్తున్నారు.
అధికారులు అటు వెళ్లారు: వెంటనే షూటింగ్
సోమవారం మద్యాహ్నం భోజనం చెయ్యడానికి వెళ్లిన సమయంలో షూటింగ్ మొదలు పెట్టారని జలమండలి అధికారులు ఆరోపిస్తున్నారు. నిషేధిత ప్రాంతంలోకి వెళ్లి షూటింగ్ చెయ్యడం వలనే ఇంత జరిగిందని అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
స్విమ్మింగ్ రాదని ముందే చెప్పారు
మాకు సరిగా స్విమ్మింగ్ రాదని నటులు అనీల్, ఉదయ్ ముందుగానే సినిమా యూనిట్ సభ్యులకు చెప్పారని, అయినా వారిద్దరిని బలవంతంగా హెలికాప్టర్ నుంచి నీటిలో నెట్టి వేయడం వలనే ఇంత జరిగిందని జలమండలి అధికారులు ఆరోపిస్తున్నారు.
చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నారు
100 అడుగుల ఎత్తులో హెలికాప్టర్ లో నుంచి కిందకు దూకే సమయంలో ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని జలమండలి అధికారులు పోలీసులకు చెప్పారు. అంతే కాకుండా ముందుగానే బోట్ ఆన్ చెయ్యలేదని, ఇద్దరు నటులు అనీల్, ఉదయ్ నీటిలో మునిగిపోయిన తరువాత బోట్ స్టాట్ చెయ్యడానికి ప్రయత్నించారని, అప్పుడు బోట్ పాడైయ్యింది అనే విషయం సినిమా యూనిట్ సభ్యులకు తెలిసిందని జలమండలి అధికారులు ఆరోపించారు.
అసలు వీరికి సరైన ప్లాన్ లేదు
సినిమా షూటింగ్ మొదలు కాక ముందు అసలు వీరికి ఎలాంటి ప్రాక్టీస్ చెయ్యలేదని, వీరి మధ్య అవగాహనలేదని, అసలు వీరికి ఒక ప్లాన్ అనేదిలేదని జలమండలి అధికారులు ఆరోపించారు. చెరువులో ఎంత ఎత్తులో నీరు ఉంది ? కిందకు దూకిన వారిని ఎలా రక్షించాలి ? వారిని క్షేమంగా బయటకు ఎలా తీసుకురావాలి ? అని ముందుగానే పక్కా ప్లాన్ వేసుకుని ఉంటే ఇంత జరిగేది కాదని జలమండలి అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.