మదనపల్లి హత్యాకాండలో ట్విస్ట్ -డాక్టర్లు vs పోలీసులు -నిందితులకు రిమాండ్ -ఆ నిమ్మకాయల వల్లే
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా మదనపల్లి జంట హత్యల కేసులో నిందితులు ఎట్టకేలకు జైలుపాలయ్యారు. మదనపల్లి మహిళా కళాశాల వైస్ ప్రిన్సిపల్ పురుషోత్తం నాయుడు, మరో స్కూలులో కరస్పాండెంట్ అయిన ఆయన భార్య పద్మజలు.. ఈనెల 24న తమ ఇంట్లోనే కన్న బిడ్డలు అలేఖ్య(27), సాయిదివ్య(21)ను క్షుద్రపూజల పేరుతో కిరాతకంగా చంపడం తెలిసిందే. ఘటన జరిగి రోజులు గడుస్తున్నా నిందితులను అరెస్టు చేయకపోవడంపై విమర్శలు, అనుమానాలు తలెత్తడంతో పోలీసులు ఎట్టకేలకు ఆ తంతు పూర్తిచేశారు..
నిమ్మగడ్డపై జగన్ సర్కారు పిడుగు -కరోనా వ్యాక్సినేషన్ రీషెడ్యూల్? -ఎస్ఈసీదే బాధ్యతన్న సజ్జల
14 రోజుల రిమాండ్..
ఇద్దరు బిడ్డల్ని చంపేసిన తల్లిదండ్రులపై హత్యానేరం మోపిన పోలీసులు వారిని మంగళవారం సాయంత్రం మదనపల్లి రెండవ అదనపు ఫస్టు క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పర్చారు. మెజిస్ట్రేట్ నిందితులకు 14 రోజుల పాటు రిమాండ్ విధించగా వారిని సబ్ జైలుకు తరలించారు. ఈ కేసు విచారణలో పిల్లలిద్దరినీ తామే చంపినట్లు నిందితులు నేడు పోలీసులు ఎదుట నేరం అంగీకరించారు. కోర్టులో ప్రవేశపెట్టడానికి ముందు కరోనా టెస్టుకు నిరాకరించిన పద్మజ.. తానే శివుడి అవతారాన్నని, గొంతులో హాలహలం ఉందని, కరోనా తననేమీ చేయలేదని, ప్రపంచంలో చెత్తను ఎరేయడానికి బాడీ పార్టికల్స్ ద్వారా కరోనాను సృష్టించినట్లు చెప్పుకొచ్చారు. కాగా..
మా బిడ్డలు తెలివైనవాళ్లు..
కోర్టులో ప్రవేశపెట్టిన సమయంలో, అంతకుముందు పోలీసుల ఎదుట పద్మజ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు కూతుళ్లు బతికి వస్తారన్న ఆశతోనే ఇలా చేశామన్నారు. ''మా ఇంట్లో దేవుళ్ళున్నారు. పూజలు చేస్తున్నాం. పూజల వల్లే మా చిన్న కుమార్తె ఆరోగ్యం బాగు పడింది. పది రోజులుగా అన్నం తినకుండా పూజలు చేస్తున్నాం. మా బిడ్డలు చాలా తెలివైనవాళ్లు. ప్రపంచంలో ఘోరాలు పెరిగిపోయాయి, అవి తగ్గటానికి పూజలు చేస్తున్నాం. ఇక కలియుగం అంతం అయిపోయింది, సత్య యుగం వచ్చింది" అని చెప్పుకొచ్చారు. మరోవైపు..
డాక్టర్లు వర్సెస్ పోలీసులు
కన్నబిడ్డల్ని కిరాతకంగా హతమార్చిన పద్మజ, పురుషోత్తం నాయుడుల మానసిక స్థితిపై పోలీసులు, డాక్టర్లు భిన్నాభిప్రాయాలు చెబుతున్నారు. నిందితులను ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షించిన సైక్రియాట్రిస్ట్ రాధిక వారి మానసిక స్థితి సరిగా లేదంటూనే, వారి ఆరోగ్య స్థితి మెరుగు పడాలంటే తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో వైద్యం ఇప్పించాలన్నారు. అంతేకాదు.. పద్మజ తండ్రి ఇటీవలే మానసికి వ్యాధితో బాధ పడుతూ ఇటీవల చినపోయారని, పద్మజ మేనత్త కూడ మానసిక వ్యాధితో బాధ పడుతోందని, పద్మజ ఉన్న సిస్థితి మానసిక శాస్త్రంలో డెల్యూషన్స్ అంటారని డాక్టర్ రాధిక వివరించారు. అటు డీఎస్పీ రవిమనోహరా చారి మాత్రం నిందితుల మానసిక స్థితి బాగానే వుందని పేర్కొన్నారు. తాము అడిగిన దానికి స్పష్టంగా సమాధానం ఇచ్చారని, అయితే ఆధ్యాత్మికత చాలా ఎక్కువగా వుందని తెలిపారు. కేసు వెలుగులోకి వచ్చిన రోజు నుంచి డీఎస్పీ చారి చేస్తోన్న కామెంట్లపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆలస్యంగా అరెస్టు చేయడంపైనా విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే..
అంత్యక్రియలు పూర్తి..
మదనపల్లి శివనగర్లోని ఇంట్లో తల్లిదండ్రుల చేతిలో హత్యకు గురైన అలేఖ్య(27), సాయిదివ్య(22)ల అంత్యక్రియలు ముగిశాయి. సోమవారం సాయంత్రం మృతదేహాలకు బంధువులు అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. తండ్రి పురుషోత్తం నాయుడు పిల్లల అంత్యక్రియలకు హాజరై మృతదేహాలకు నిప్పంటించారు. తల్లి పద్మజను అంత్యక్రియలు జరిగే ప్రదేశానికి తీసుకువచ్చినా దూరంగా ఉంచారు. తన భార్య, కూతుళ్ల మానసిక స్థితిపై పురుషోత్తం నాయుడు పోలీసులకు సంచలన విషయాలను వెల్లడించారు. నిజానికి ఆయన తన కొలీగ్ కు ఫోన్ చేయడం ద్వారానే ఈ హత్యాకాండ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. పురుషోత్తం నాయుడు చెప్పిన వివరాల ప్రకారం..
ఆ నిమ్మకాలయ వల్లే ఈ ఘోరం
ఆరు నెలల క్రితం వరకు ప్రశాంత్నగర్లోనే నివాసం ఉన్న పురుషోత్తం కుటుంబం శివనగర్లో నూతనంగా ఇల్లు నిర్మించుకుని ఆగస్టు 14న గృహప్రవేశం చేసింది. రెండు వారాల కిందట ఫ్యామిలీ అంతా వ్యాహ్యాళికి వెళుతున్న సమయంలో చిన్నకూతురు సాయిదివ్య.. వీధిలో ఎవరో మంత్రించి లేదా దిష్టితీసి పారేసిన నిమ్మకాలను పొరపాటున తొక్కింది. ఆ రోజు నుంచి ఆమెతోపాటు కుటుంబమంతా ఆందోళన పెరుగుతూ వచ్చింది. పెద్దమ్మాయి అలేఖ్య తొమ్మిదో తరగతి నుంచే తాను శివస్వరూపాన్ని అని చెప్పేదని, తనకు మహిమలున్నాయని చెల్లెల్ని నమ్మించేదని తెలుస్తోంది. వీధిలో నిమ్మకాలయలు తొక్కిన తర్వాత చెల్లెలు సాయిదివ్యను అలేఖ్య మరింత భయపెట్టిందని, దానికి తల్లి పద్మజ కూడా వంతపాడటంతో వ్యవహారం దారుణానికి దారి తీసిందని తెలుస్తోంది. ఈ క్రమంలో..
10 రోజులుగా పూజలు.. నగ్నంగా..
అక్క అలేఖ్య, తల్లి పద్మజలు ఇంకా భయపెట్టడంతో.. చిన్నమ్మాయి సాయిదివ్య ఇంట్లో శక్తులు తిరుగుతూ, భయపెడుతున్నాయని, ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని ప్రాధేయపడేదని, లేకపోతే డాబాపై నుంచి దూకేస్తానని చెప్పడంతో మూడు రోజులుగా కాపలా కాసినట్లు తండ్రి పురుషోత్తం పోలీసులకు వెల్లడించారు. దివ్యను తనదారిలో తెచ్చుకునేందుకు అలేఖ్య లేనిపోని భయాలను కలిగించి మెల్లగా తన వశం చేసుకుందని, చెల్లిలో ఉన్న దుష్టశక్తిని చంపేస్తున్నామని చెప్పి తల్లితో కలిసి ఆమెను హత్యచేసిందని, చెల్లెలిని బతికించటానికి తనను కూడా చంపాలని తల్లిదండ్రులను కోరింది అలేఖ్య. చెల్లెలి ఆత్మ బయటకు వెళ్లకుండా ఉండాలంటే తాను కూడా ఆత్మగా మారి చెల్లెలు ఆత్మను తిరిగి తీసుకొస్తానని..చెప్పింది. ఆ తరువాత తల్లిదండ్రులు పురుషోత్తం, పద్మజ, అలేఖ్య మొత్తం ముగ్గురూ కలిసి ఇంట్లో నగ్నంగా కూర్చుని పూజలు చేశారు. ఆ తరువాత అలేఖ్యను పూజ గదిలోకి తీసుకెళ్లి ఆమె నోట్లో చిన్న రాగి కలశాన్ని పెట్టి..దాంట్లో నవ ధాన్యాలను పోసి..అలేఖ్య తలపై గట్టిగా డంబెల్స్ తో కొట్టటంతో అలేఖ్య కూడా ప్రాణాలు విడిచింది. నిమ్మకాయలు తొక్కిన తర్వాత నుంచి, గడిచిన 10రోజులుగా సాగిన పూజల తంతులో చివరికి రెండు నిండుప్రాణాలు బలయ్యాయి.
నిమ్మగడ్డతో పోరులో జగన్ వైఫల్యానికి కారణమిదే -తర్వాత స్టెప్ ఇదైతేనే సేఫ్: ఎంపీ రఘురామ
ఫోటోలు: నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో 72వ గణతంత్ర వేడుకలు: హాజరైన గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్