నోటి దురుసు : సాధ్వీని గాడ్సేతో పోల్చిన ఆజంఖాన్..
రామ్పూర్ : కాంట్రవర్శియల్ కామెంట్లకు కేరాఫ్ అడ్రస్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ఆజంఖాన్. తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే ఆయన తాజాగా మరో వివాదానికి తెరతీశారు. మదర్సాల్లో కొత్త విద్యా విధానాన్ని అమలు చేస్తామన్న ప్రధాని ప్రకటనపై ఘాటుగా స్పందించారు. గాడ్సేను, సాధ్వీ ప్రగ్యాను ఒకే గాటున కడుతూ ఆయన చేసిన కామెంట్లు పెను దుమారమే రేపాయి.
మరో బీజేపీ కార్యకర్త మృతి .. బ్లాక్ డే పాటిస్తూ శ్రేణుల నిరసన
మదర్సాలో గాడ్సేలు, సాధ్వీలు తయారవరు
నూతన విద్యా విధానంలో భాగంగా మదర్సాల్లోనూ బోధన విషయంలో మార్పులు చేస్తామన్న ప్రధాని ప్రకటనను ఆజంఖాన్ తప్పుబట్టారు. మదర్సాలు గాడ్సేలు, సాధ్వీలు తయారు చేయవంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సాధ్వీ ప్రగ్యాసింగ్ ఠాకూర్ను మహాత్ముని హత్య చేసిన నాథూరామ్ గాడ్సేతో పోల్చారు. మదర్సాల్లో నాథూరామ్ గాడ్సేలాంటి ప్రవృత్తి, ప్రగ్యా ఠాకూర్లాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు తయారవరు అని చెప్పారు. విద్యా విధానంలో మార్పు చేసే ముందు గాడ్సే లాంటి వారు ప్రజాస్వామ్యానికి శతృవులని, ఉగ్ర కార్యకలాపాల్లో దోషులైన వారిని మానుకోవాలని ఆజం ఖాన్ సూచించారు.
మౌలిక వసతులు సమకూర్చండి
కేంద్రం నిజంగా మదర్సాలకు సాయం చేయాలనుకుంటే వాటిని మరింత అభివృద్ధి చేయాలని ఆజంఖాన్ కేంద్రానికి సూచించారు. మదర్సాల్లో మతపరమైన అంశాలతో పాటు హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్ ఎప్పటి నుంచో బోధిస్తున్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. ఒకవేళ మోడీ నిజంగా సాయం చేయాలనుకుంటే మదర్సాలకు కొత్త భవనాలు నిర్మించి, ఫర్నీచర్ సమకూర్చి, మధ్యాహ్న భోజనపథకం అమలు చేస్తే చాలని సూచించారు.
మదర్సాల్లో విద్యావిధానం మార్పు
నూతన విద్యా విధానంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న మదర్సాల్లో చదువు చెప్పే టీచర్లకు హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్,కంప్యూటర్స్లో శిక్షణ ఇప్పిస్తామని కేంద్రం మంగళవారం ప్రకటించింది. మైనార్టీలకు మరింత చేరువయ్యే ప్రయత్నంలో భాగంగా వచ్చే ఐదేళ్లలో ముస్లిం మైనార్టీ విద్యార్థులకు ఐదు కోట్ల స్కాలర్షిప్పులు అందజేస్తామని చెప్పింది.