హైదరాబాద్ తరహాలో: ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వ్యక్తి ఇంటికి వెళ్లిన డాక్టర్లపై రాళ్లతో దాడి
భోపాల్: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన కరోనా పేషెంట్ కుటుంబ సభ్యులు, బంధువులు డాక్టర్లపై దాడి చేసిన ఉదంతం తరువాత.. అలాంటి ఘటనే మరొకటి మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. కరోనా పేషెంట్ అనుమానితుడిని ఆసుపత్రికి తరలించడానికి అతని ఇంటికి వెళ్లిన ఇద్దరు మహిళా డాక్టర్లు, వైద్య సిబ్బందిపై రాళ్ల వర్షాన్ని కురిపించారు స్థానికులు. రాళ్లతో దాడి చేశారు. వారిని తరిమి కొట్టారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఆపరేషన్ నిజాముద్దీన్: రంగంలో దిగిన అజిత్ దోవల్: అర్ధరాత్రి 2 గంటలకు మర్కజ్ మసీదు వద్ద..!
ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లొచ్చి..
ఇండోర్లోని తట్పట్టి భాకల్ ప్రాంతంలో నివసించే ఓ వ్యక్తి దేశ రాజధానిలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ మసీదులో నిర్వహించిన సామూహిక మత ప్రార్థనలకు వెళ్లొచ్చారు. కరోనా పేషెంట్ అనే ముద్ర వేస్తారనే ఉద్దేశంతో ఈ విషయాన్ని బయట ఎక్కడా చెప్పుకోలేదు. ఇండోర్ వైద్యాధికారులు అతని పేరు, చిరునామా, ఫోన్ నంబర్లను ఢిల్లీ పోలీసుల నుంచి సేకరించారు. ఆ సమాచారం మేరకు అతనికి వైద్య పరీక్షలను నిర్వహించడానికి ఆసుపత్రికి రావాలని ఫోన్ ద్వారా సూచించారు. దీన్ని అతను పట్టించుకోలేదు.
అంబులెన్స్ను పంపించగా..
దీనితో ఇండోర్ వైద్యాధికారులు అతని ఇంటికి అంబులెన్స్ను పంపించారు. ఇద్దరు మహిళా డాక్టర్లు, వైద్య సిబ్బంది అతని ఇంటికి వెళ్లగా వైద్య పరీక్షలకు నిరాకరించాడు. ఈ విషయాన్ని తన వీధిలో వారందరికీ తెలియజేశాడు. దీనితో సుమారు 50 మంది అతని ఇంటికి చేరుకున్నారు. డాక్టర్లతో గొడవ పడ్డారు. వారితో ఘర్షణకు దిగారు. తరిమి కొట్టారు. చేతికి అందిన వస్తువులతో దాడి చేశారు. రాళ్లు రువ్వారు. ఈ దాడిలో డాక్టర్లకు తీవ్రత గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అదే ప్రాంతంలో లాక్డౌన్ డ్యూటీలో ఉన్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
Recommended Video
జిల్లా వైద్యాధికారులు ఫిర్యాదు..
ఈ ఘటనపై ఇండోర్ జిల్లా వైద్యాధికారులు ఛత్రిపురా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై వారు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కరోనా పేషెంట్ల ప్రాణాలను నిలపడానికి తాము రేయింబవళ్లు శ్రమిస్తున్నామని, డాక్టర్లపై దాడి చేయడం సరికాదని చెప్పారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని, వైద్య సిబ్బందికి రక్షణ కల్పిస్తామని మధ్యప్రదేశ్ డీజీపీ హరినారాయణ్ చారి మిశ్రా తెలిపారు. రాళ్ల దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.