మరో షాక్: బీజేపీలో చేరిన 22 మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే పదవులకు రాజీనామా చేసిన 22 మంది రెబల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శనివారం భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరారు. ఇటీవలే బీజేపీలోచేరిన సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియాతో కలిసి వెళ్లిన ఈ ఎమ్మెల్యేలు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువాలు కప్పుకున్నారు.
ఆరుగురు మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు బీజేపీ చేరారని, వారికి టికెట్లు ఇస్తామని నడ్డా నుంచి హామీ లభించిందని జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు. అంతేగాక, వారి గౌరవానికి ఎలాంటి భంగం కలిగించమని చెప్పారని తెలిపారు. 22 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో మహారాష్ట్రలోని కమల్ నాథ్ ప్రభుత్వం కుప్పకూలిన విషయం తెలిసిందే.
శుక్రవారం బలపరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. అంతకుముందు ముఖ్యమంత్రి పదవికి కమల్ నాథ్ రాజీనామా చేశారు. ఈ సందర్భంగా బీజేపీపై కమల్ నాథ్ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ ప్రభుత్వం 15 ఏళ్లలో చేసింది తాను 15 నెలల కాలంలోనే చేశానని కమల్ నాథ్ చెప్పుకొచ్చారు. ఐదేళ్ల పాలన కోసం ప్రజలు తమకు ఓటు వేశారని చెప్పారు. అయితే, బీజేపీ మాత్రం తమ ప్రభుత్వాన్ని అస్థిరపర్చే కుట్రలకు పాల్పడిందని ఆరోపించారు. ప్రజా తీర్పును బీజేపీ అపహాస్యం చేసిందని అన్నారు.
తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కర్ణాటకలో బంధించిందని కమల్ నాథ్ ఆరోపించారు. తమ ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందని అన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంపై బీజేపీ కుట్రలు చేసే కూలదోసేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. ఇది రాష్ట్ర ప్రజలు కోరుకున్నదానికి విరుద్ధమని అన్నారు.
Jyotiraditya Scindia, BJP: Our 22 MLAs have joined BJP today with the blessings of Party President JP Nadda. All will get tickets. He encouraged us and assured that everyone's honour will be maintained. https://t.co/kgTnmQ90jw pic.twitter.com/nj4zlsmtQH
— ANI (@ANI) March 21, 2020
కాగా, 22 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు లైన్ క్లియర్ అయ్యింది. రాష్ట్ర అసెంబ్లీ బీజేపీకి 107 స్థానాలుండగా, కాంగ్రెస్ పార్టీకి 92 స్థానాలు మాత్రమే ఉన్నాయి. ఇక రాష్ట్రంలోని ఎస్పీ, బీఎస్పీ ఎమ్మెల్యేలు కూడా బీజేపీకే మద్దతు పలకడం గమనార్హం. దీంతో మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.