సీఎం పదవికి రాజీనామా నాడే కరోనా కాటు? క్వారంటైన్లో కమల్నాథ్.. ఎంపీలో టెన్షన్
వచ్చింది విమానంలోనే అయినా కరోనా ఎవర్నీ వదలట్లేదు. సామాన్యుడి నుంచి సీఎం స్థాయి వ్యక్తుల దాకా వైరస్ టెస్టులకు వెనుకాడట్లేదు. మధ్యప్రదేశ్ లో ఒక జర్నలిస్టుకు పాజిటివ్ అని తేలడంతో యావత్ రాష్ట్రం ఒక్కసారే ఉలిక్కిపడింది. ఎందుకంటే ఆ జర్నలిస్టు ఇటీవలే వీవీఐపీల ప్రెస్ మీట్లకు హాజరయ్యాడు. సదరు వీవీఐపీలు తమకంటే పెద్దవాళ్లనూ కలిసిన దాఖలాలుండటంతో పరిస్థితి మొత్తం గందరగోళంగా మారిందిప్పుడు.
మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటుతో కాంగ్రెస్ సర్కారు కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈనెల 20న కమల్ నాథ్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ సందర్భంగా ప్రెస్ మీట్ కు హాజరైన ఓ జర్నలిస్టుకు వైరస్ సోకినట్లు బుధవారం నిర్ధారణ అయింది. సదరు జర్నలిస్టు కూతురికి కూడా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆ ప్రెస్ మీట్ లో పాల్గొన్న రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు, ఇతర జర్నలిస్టులు భయంతో ఆస్పత్రులకు పరుగులు తీశారు.
వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటం, పాజిటివ్ వ్యక్తికి దగ్గరగా మసలిన నేపథ్యంలో మాజీ సీఎం కమల్ నాథ్ సెల్ప్ క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. జర్నలిస్టుకు పాజిటివ్ అని తెలిసిన వెంటనే కమల్ తన ఇంట్లోని ఓ గదికే పరిమితమైపోయారు. పదవికి రాజీనామా తర్వాత ఆయన గవర్నర్ లాల్జీ టండన్ ను కూడా కలిసుండటంతో రాజ్ భవన్ లోనూ ఒకింత ఆందోళకర వాతావరణం నెలకొంది. సదరు ప్రెస్ మీట్ కు హాజరైన వారందరూ క్వారంటైన్ లో ఉండాలని అధికారులు ఆదేశించారు. గవర్నర్ కు కూడా టెస్టులు నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
Recommended Video
లాక్డౌన్ అమల్లోకి వచ్చిన మొదటి రోజే దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. బుధవారం మధ్యాహ్నం నాటికి మొత్తం 562 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చాన్నాళ్లుగా ఒక్క కేసు కూడా నమోదు కాని మధ్యప్రదేశ్ లో బుధవారం నాటికి జర్నలిస్టుతో కలిపి కేసుల సంఖ్య 15కు చేరుకుంది. సోమ, మంగళవారాల్లో మొత్తం 14 పాజిటివ్ కేసులు వచ్చాయి. అందులో ఒక మహిళ ప్రఖ్యాత ఉజ్జయినీ పట్టణానికి చెందినావిడ కావడం గమనార్హం. పుణ్యక్షేత్రం ఉజ్జయినిలో వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.