డాక్టర్లలో ఈ యాంగిల్ కూడా ఉందా?: బిల్లు చెల్లించలేదని వృద్ధుడిని మంచానికి కట్టేసి..దారుణం
భోపాల్: కరోనా వైరస్ కమ్మేసిన ప్రస్తుత పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా డాక్టర్లు, నర్సులు, ఇతర హెల్త్ వర్కర్లు ఫ్రంట్లైన్ వారియర్లుగా గుర్తింపు పొందారు. కుటుంబాలను వదిలేసి.. గాలి కూడా దూరని పీపీఈ కిట్లను ధరించి..రోజుల తరబడి కరోనా వైరస్ పేషెంట్లను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. అలాంటి డాక్టర్లలో కొందరు ఏ స్థాయిలో ఫీజులకు కక్కుర్తి పడుతున్నారో స్పష్టం చేయడానికి బహుశా ఇంత కంటే మంచి ఉదాహరణ దొరక్కపోవచ్చు. దేశం మొత్తం పూలతో పూజించిన డాక్టర్లలో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా? అనిపించే ఘటన మధ్యప్రదేశ్లోని షాజాపూర్లో చోటు చేసుకుంది.
వుహాన్ను తలపిస్తోన్న ముషీరాబాద్ ఫిష్ మార్కెట్: మృగశిర ఎఫెక్ట్: చేపల కొనుగోలుదారులతో కిటకిట
షాజాపూర్ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 80 సంవత్సరాల వృద్ధుడొకరు అనారోగ్యానికి గురి అయ్యారు. షాజాపూర్లోని సిటీ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు చికిత్స నిర్వహించిన అనంతరం డాక్టర్లు 11 వేల రూపాయల బిల్లును చేతిలో పెట్టారు. ఆసుపత్రిలో చేరే సమయంలో అయిదు వేల రూపాయలను డిపాజిట్ చేశారు. ఈ మొత్తం పోనూ ఇంకా 11 వేల రూపాయలు చెల్లించాలని డాక్టర్లు ఆ వృద్ధుడి కుమార్తెకు చెప్పారు. బిల్లు చెల్లించలేకపోవడంతో ఆ వృద్ధుడు ఎక్కడ పారిపోతాడోననే అనుమానంతో అతణ్ని తాళ్లతో బంధించారు. కాళ్లు, చేతులను మంచానికి కట్టేశారు. ఎటూ కదల్లేని పరిస్థితికి తీసుకొచ్చారు.
ఒక్కరోజు గడువు ఇవ్వమని అడిగినా డాక్టర్లు స్పందించలేదని ఆమె కుమార్తె ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యాయి. సిటీ ఆసుపత్రి ఘటనపై స్పందించారు. ఈ ఫొటోలు జిల్లా అధికారుల దృష్టికి చేరాయి. దీనతో వారు విచారణకు ఆదేశించారు. కాళ్లు, చేతులను కట్టేయడానికి గల కారణాలపై ఆరా తీయగా.. బిల్లు చెల్లించలేదనే విషయం బయటికి వచ్చింది. ఆసుపత్రి డాక్టర్లపై కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సైతం ఈ ఘటనపై ఆరా తీశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఆసుపత్రి డాక్టర్లు దీనికి భిన్నంగా వాదిస్తున్నారు. వృద్ధుడికి మూర్చరోగం ఉందని, అందుకే అతణ్ని అలా ఆసుపత్రి మంచానికి కట్టేయాల్సి వచ్చిందనం అంటున్నారు. మూర్ఛ ఉన్న సమయంలో పేషెంట్లు తమను తాము గాయపరచుకుంటూ ఉంటారని, ఆ పరిస్థితి రాకుండా ఉండటానికి కాళ్లూ, చేతులను కట్టేయాల్సి వచ్చిందని వివరణ ఇస్తున్నారు. ఆ వృద్ధుడి కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వైద్యానికి అయిన ఖర్చును భరించదలిచామని చెప్పారు. అతను చెల్లించాల్సిన బిల్లులను మాఫీ చేశామని చెబుతున్నారు. విచారణ నుంచి తప్పించుకోవడానికి డాక్టర్లు అలా చెబుతున్నారనే విమర్శలు ఉన్నాయి.