మేమున్నాం మీ వెంట: అమర జవాన్ల కుటుంబాలకు భరోసా ఇస్తున్న దేశం
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద జైషె మహమ్మద్ ఉగ్రవాదులు చేసిన దాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ అమర జవాన్ల కుటుంబాలను ఆదుకోవడానికి దేశం కదిలి వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలూ తమవంతు సహాయం అందజేయడానికి సిద్ధపడ్డాయి. అమర జవాన్ల కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకోవడానికి, వారి పిల్లలకు ఉచితంగా విద్యను అందించడానికి, కుటుంబ సభ్యులకు అర్హతను బట్టి ఉద్యోగాలను కల్పించడానికి వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు ముందుకొస్తున్నాయి. పారిశ్రామికవేత్తలు తమ ఫౌండేషన్ ద్వారా అమర జవాన్ల పిల్లలకు ఉచితంగా చదివిస్తామని ప్రకటిస్తున్నారు.
సీఆర్పీఎఫ్ అమర జవాన్ల కుటుంబాలకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కోటి రూపాయల పరిహారాన్ని ప్రకటించింది. తమ రాష్ట్రానికి చెందిన అశ్వినీ కుమార్ కచ్చీ జవాన్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి కమల్ నాథ్ ప్రకటించారు. అశ్వినీ కుమార్ పార్థివ దేహానికి నివాళి అర్పించారు. అనంతరం ఆయన కోటి రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. దీనితో పాటు ఆయన కుటుంబానికి ఇంటిని కట్టి ఇస్తామని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని కమల్ నాథ్ హామీ ఇచ్చారు.
ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం అమర జవాన్ల కుటుంబానికి 25 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించింది. ఉగ్రదాడిలో అమరులైన 40 మంది జవాన్లలో 12 మంది ఉత్తర్ ప్రదేశ్ కు చెందినవారే. 12 మంది అమరుల కుటుంబీకులకు 25 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇస్తామని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రకటించింది. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇస్తామని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు.
తమిళనాడు ప్రభుత్వం 20 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించింది. పుల్వామా ఉగ్రదాడిలో తమిళనాడుకు చెందిన ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. వారి కుటుంబాలకు 20 లక్షల రూపాయల చొప్పున పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వంలో ఉద్యోగం కల్పిస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళణిస్వామి వెల్లడించారు. ఉగ్రదాడిలో జార్ఖండ్ కు చెందిన విజయ్ సోరెంగ్ అసువులు బాశారు. ఆయన కుటుంబానికి జార్ఖండ్ ప్రభుత్వం 10 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రఘువర్ దాస్ ప్రకటించారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని అన్నారు. త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేవ్ కుటుంబానికి రెండు లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు.
ప్రభుత్వాలే కాకుండా.. కొందరు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. అమర జవాన్ల పిల్లలను తమ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా చదివిస్తామని, వారి ఉజ్వల భవిష్యత్తుకు తోడ్పాటు అందిస్తామని భరోసా ఇస్తున్నారు.