ఢిల్లీకి దగ్గరి దారి!: తెలంగాణ, రాజస్థాన్ కాదు.. 2019కి మధ్యప్రదేశ్ కీలకం, ఎలా?
భోపాల్: ఐదు రాష్ట్రాల ఎన్నికలు 2019 సార్వత్రిక ఎన్నికలకు కీలకం కానున్నాయి. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీకి ఢిల్లీ పీఠం దగ్గర అవుతుందని భావించవచ్చు. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గఢ్, మిజోరాం రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి.
ఈ ఐదు రాష్ట్రాలలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గఢ్లలో బీజేపీ అధికారంలో ఉంది. మిజోరాంలో కాంగ్రెస్ ఉండగా, తెలంగాణలో ప్రాంతీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఉంది. ఐదు రాష్ట్రాల్లో కేవలం మధ్యప్రదేశ్ గెలుపు మాత్రమే ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీలకు చాలా కీలకం అని చెప్పవచ్చు. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.
మధ్యప్రదేశ్లో గెలిచినవారు 2019లో ఢిల్లీ పీఠానికి దగ్గరగా
మధ్యప్రదేశ్లో ఎవరు గెలిస్తే వారు ఢిల్లీ పీఠానికి దాదాపు అంత దగ్గరగా ఉన్నారని భావించవచ్చు. ఈ రాష్ట్రంలో మూడు దఫాలుగా బీజేపీ అధికారంలో ఉంది. దీంతో ప్రభుత్వ వ్యతిరేకత సహజం. దీనికి తోడు ఇటీవల రైతుల ఆందోళనలు, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ, నోట్ల రద్దు చాలామందిపై ప్రభావం చూపింది.
కలిసి పని చేస్తున్న కాంగ్రెస్ నేతలు
ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు ఈ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు కమల్ నాథ్, జ్యోతిరాధిత్య సింధియా, దిగ్విజయ్ సింగ్లు కలిసి పని చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి లాభిస్తుంది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాత్రం తాను చేపట్టిన సంక్షేమ పథకాలు బీజేపీని మళ్లీ గద్దెనెక్కిస్తాయని విశ్వాసంతో ఉన్నారు.
మధ్యప్రదేశ్ కీలకం, తెలంగాణలో ఇదీ పరిస్థితి
ఇక మధ్యప్రదేశ్ రాష్ట్రమే కీలకం ఎందుకంటే తెలంగాణలో ప్రాంతీయ పార్టీ తెరాస, కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి మధ్య హోరా హోరీ ఉంది. ఇక్కడ బీజేపీకి అంతగా బలం లేదు. 119 సీట్లకు గాను దాని బలం గత ఎన్నికల్లో కేవలం ఐదు. కాబట్టి బీజేపీ ఈ రాష్ట్రంలో ఓడినా దానిని ఎవరూ పరిగణలోకి తీసుకోరు. ఎలాగు బలం లేని పార్టీ. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి ఓడిపోతే మాత్రం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు ఉన్నాయని, అందుకే ఓడిందని బీజేపీ ప్రచారం చేసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. దక్షిణాదిన బీజేపీకి బలం లేదనే విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ లెక్కన జాతీయస్థాయిలో బీజేపీకి వచ్చే నష్టం లేదు. దక్షిణాదిన ప్రాంతీయ పార్టీల హవా కాబట్టి దీని ప్రభావం లోకసభ ఎన్నికలపై అంతగా ఉండదని అంటున్నారు.
రాజస్థాన్లో ఇదీ పరిస్థితి
రాజస్థాన్లో కాంగ్రెస్ గెలిచినా ఇక్కడి ఓటర్లకు ప్రతి అయిదేళ్లకు ఓ పార్టీకి పట్టం కట్టే అలవాటు ఉంది. దీంతో ఆ రాష్ట్ర ఫలితాలు కూడా 2019 ఎన్నికలపై ప్రభావం చూపవు. ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుందని సర్వేలు చెబుతున్నాయి. అయిదేళ్లకో పార్టీకి పట్టం కట్టే అలవాటుతో పాటు వసుంధరా రాజేపై వ్యతిరేకత ఉన్న అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి 2019 లోకసభ ఎన్నికలకు దీనిని కూడా ప్రాతిపదికగా తీసుకునే అవకాశం లేదు.
చత్తీస్గఢ్, మిజోరాం
సెంట్రల్ ఇండియాలో ఉన్న చత్తీస్గడ్లో కాంగ్రెస్ గట్టిపోటీ ఇచ్చినప్పటికీ బీజేపీయే మళ్లీ గెలుస్తుందని సర్వేలు చెబుతున్నాయి. అయినప్పటికీ దీనిని కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం లేదు. ఈ రాష్ట్ర ఫలితాలు దేశవ్యాప్తంగా ప్రభావితం చేసే అవకాశం ఉండదని అంటున్నారు. ఇక, ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీకి అంతగా బలం లేదు. అయినప్పటికీ గత కొన్నాళ్లుగా బీజేపీ లేదా దాని మిత్రపక్షాలు ఏడింట ఆరు రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకున్నాయి. మిజోరాంలో బీజేపీ పరిస్థితి వేరు. అక్కడ మిత్రపక్షం లేదు. కానీ కాంగ్రెస్సేతర పార్టీకి మెజార్టీ తగ్గితే అండగా నిలబడే ఛాన్స్ ఉంది. కానీ గతంలో మిజోరాంలో ఒక్క సీటు లేదని బీజేపీ ఏం సాధిస్తుందనేది ప్రశ్నార్థకమే. కాబట్టి చత్తీస్గఢ్, మిజోరాం ఫలితాలు కూడా లోకసభ ఎన్నికలపై అంతగా ప్రభావం చూపవని అంటున్నారు.
అందుకే మధ్యప్రదేశ్ కీలకం
తెలంగాణ, మిజోరాం, చత్తీస్గఢ్, రాజస్థాన్లను మినహాయిస్తే.. 2019 లోకసభ ఎన్నికలను ప్రభావితం చేయగలిగిన, ఉత్తరాది రాష్ట్రం కేవలం మధ్యప్రదేశ్ అని అంటున్నారు. ఇక్కడ బుధవారం ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రమే కీలకం కాబట్టి అధికారం దక్కించుకునేందుకు కాంగ్రెస్, నిలుపుకునేందుకు బీజేపీ గట్టి ప్రయత్నాలే చేశాయి. ఇక్కడ బీజేపీ ప్రభుత్వ వ్యతిరేకతను దాటి నాలుగోసారి గెలిస్తే అది అద్భుతమే. అప్పుడు మోడీ సంస్కరణలకు ప్రజలు ఆమోదం తెలిపినట్లు భావించవచ్చు. కాంగ్రెస్ గెలిస్తే మాత్రం బీజేపీకి కష్టాలే.