మధ్యప్రదేశ్, బెంగాల్లో విలయం -భారీ వర్షాలకు పోటెత్తిన వరద -సీఎంలకు ప్రధాని మోదీ ఫోన్
మధ్య, తూర్పు భారతంలో వాన విలయాన్ని సృష్టించింది. వందలకొద్దీ గ్రామాలు నీట మునిగాయి. సాక్ష్యాత్తూ మంత్రులు సైతం వరదలో చిక్కుకుపోగా, ముఖ్యమంత్రులు అలుపు లేకుండా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నారు..
మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్ను వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలతో మధ్యప్రదేశ్లోని 12 వందల గ్రామాలు నీట మునిగాయి. రోడ్లు ధ్వంసమయ్యాయి. వంతెనలు కుప్పకూలాయి. టెలిఫోన్ వ్యవస్థ అస్తవ్యస్తమైంది. ఆరు జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ అక్కడి పరిస్థితులను పరిశీలించారు. బెంగాల్ లో సీఎం మమతా బెనర్జీ హౌరా జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలకు కాలినడకన వెళ్లారు.
దాతియా జిల్లాలో వరద పరిస్థితిన పరిశీలించెందుకు వెళ్లిన మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా అనూహ్యరీతిలో తానే వరదలో చిక్కుకుపోయారు. దీంతో రెస్క్యూ సిబ్బంది ఆయనను కాపాడింది. ఆర్మీ సహా ఎన్డీఆర్ఎఫ్, బీఎ్సఎఫ్ దళాలు సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయని, 5,950 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని ముఖ్యమంత్రి చౌహాన్ తెలిపారు. మరో 1,950 మంది వరద నీటిలో చిక్కుకున్నారని, వాళ్లను రక్షించేందుకు సహాయ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయని తెలిపారు.
ఎంపీ, బెంగాల్ వరద పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్లు చేశారు. దాతియా జిల్లా లో వరదల ధాటికి రెండు బ్రిడ్జిలు కుప్పకూలాయని, మరో బ్రిడ్జి తీవ్రంగా దెబ్బతిందని చౌహాన్ వెల్లడించారు. ఎంపీ సహా బెంగాల్ కు కేంద్రం అండగా ఉంటుందని ప్రధాని భరోసా ఇచ్చారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఎంపీ సీఎంకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది.
Recommended Video
పశ్చిమ బెంగాల్ లో ఏడు జిల్లాలు వరద ప్రభావానికి గురయ్యాయి. 23 మంది మృతి చెందగా.. 3 లక్షల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సీఎం మమతా బెనర్జీ ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడే ప్రధాని మోదీ ఫోన్ చేసి అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దామెదర్ వ్యాలీ కార్పొరేషన్ (డీవీసీ)పై ప్రధానికి మమత ఫిర్యాదు చేశారు. డీవీసీ అధికారులు.. తమకు సమాచారం ఇవ్వకుండా అక్కడి డ్యామ్ల నుంచి ఒక్కసారిగా నీళ్లు విడుదల చేశారని, ఇదే వరదలకు కారణమైందని ఆరోపించారు.