సీఏఏ ర్యాలీ: జుట్టు పట్టడంతో... బీజేపీ కార్యకర్తల చెంప ఛెళ్లుమనిపంచిన లేడీ కలెక్టర్లు(వీడియో)
Recommended Video
భోపాల్: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు మద్దతుగా మధ్యాప్రదేశ్ రాష్ట్రంలోని రాజ్గఢ్ జిల్లా బియోరా పట్టణంలో భారతీయ జనతా పార్టీకి చెందిన కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు. రోడ్లపైకి రావడంతో వారిని అదుపులో చేయడానికి పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులతోపాటు కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్ కూడా వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
చెంప ఛెల్లుమనిపించిన కలెక్టర్..
ఈ క్రమంలో ఆందోళన చేస్తున్న వారిలో ఒకరు డిప్యూటీ కలెక్టర్ ప్రియా వర్మ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఆందోళనకారులను చెదరగొడుతున్న సమయంలో ఓ నిరసనకారుడు ఆమె జుట్టుపట్టి లాగాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రియా వర్మ.. అతడ్ని చెంప ఛెల్లుమణిపించింది.
అనుమతి లేకపోవడంతో..
ర్యాలీకి ముందస్తుగా అనుమతి లేకపోవడంతోనే పోలీసులు ఈ ర్యాలీని అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యిందని అందుకే వారిని చెదరగొట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.
చెంపలు వాయించిన కలెక్టర్లు..
పోలీసులతోపాటు జిల్లా కలెక్టర్ నిధి నివేదిత, డిప్యూటీ కలెక్టర్ ప్రియా వర్మ కూడా ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కొందరు బీజేపీ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించడంతో వారిని లాగి లాగి కొట్టారు డిప్యూటీ కలెక్టర్ ప్రియా వర్మ. కలెక్టర్ నిధి నివేదిత కూడా ఒకరిద్దరి చెంపలు పగలగొట్టారు.
ఆ ఇద్దరి అరెస్ట్, కేసులు నమోదు
ఈ క్రమంలో పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి వ్యాన్లలో తరలించారు. కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్ల అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి, వారిపై కేసు నమోదు చేశారు. బీజేపీ కార్యకర్తలు ఆందోళనలు, కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్లపై దురుసుగా ప్రవర్తించిన తీరు, వారిని చెంప ఛెల్లుమణిపించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా, సీఏఏకు మద్దతుగా బీజేపీ ర్యాలీలు చేస్తుంటే.. ఇప్పటికే తాము సీఏఏను అమలు చేయబోమంటే మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు సీఏఏకు మద్దతుగా వ్యాఖ్యలు చేస్తుండటం గమనార్హం. కేరళ, పశ్చిమబెంగాల్ సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు తాము సీఏఏను అమలు చేయబోమని ప్రకటించిన విషయం తెలిసిందే.