ఇంట్లో నుంచి రూ.46 లక్షలు తీసుకెళ్లి, స్నేహితులకు పంచిన విద్యార్థి
Recommended Video
భోపాల్: ప్రెండ్షిప్ డే సందర్భంగా జబల్పూర్కు చెందిన ఓ పదో తరగతి విద్యార్థి తన తండ్రి వద్ద నుంచి డబ్బులు ఎత్తుకెళ్లి మరీ పెద్ద పార్టీ ఇవ్వడంతో పాటు బహుమతులు ఇచ్చాడు. ఇందుకోసం అతను ఏకంగా రూ.46 లక్షలు ఖర్చు చేశాడు. రూ.15 లక్షలు తన పేద స్నేహితుడికి ఇచ్చాడు. మరో రూ.3 లక్షలు తనకు హోంవర్క్ చేసి ఇచ్చిన ఫ్రెండ్కు ఇచ్చాడు.
ఆ విద్యార్థి తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఓ ఆస్తి అమ్మగా రూ.60 లక్షలు వచ్చాయి. వాటిని ఇంటిలోని అల్మారాలో దాచి పెట్టాడు. అందులో నుంచి కొడుకు రూ.45 లక్షలను తీసుకున్నాడు. ఆ విద్యార్థి తరగతిలోని 35 మందికి తలా కొంచెం పంచాడు. దీంతో విద్యార్థులు, వారి కుటుంబాలు అనందపడ్డాయి.
వీరిలో ఒకరు ఆ డబ్బుతో కారు కొనుక్కోగా, మరికొందరు స్మార్ట్ ఫోన్లు, వెండి బ్రేస్ లెట్లు కొనుగోలు చేశారు. ఈలోగా దాచిన రూ.60 లక్షల్లో రూ.46 లక్షలు కనిపించపోయేసరికి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. విచారణ జరిపిన పోలీసులు.. అతని కొడుకే ఈ మొత్తం తీసుకెళ్లి, స్నేహితులకు పంచిపెట్టాడని తెలియడంతో విస్తుపోయారు.
పోలీసులు రూ.15 లక్షల వరకు రికవరీ చేయగలిగారు. అయితే రూ.15 లక్షలు తీసుకున్న విద్యార్థి కుటుంబం జాడ తెలియరాలేదు. తీసుకున్న నగదును అయిదు రోజుల్లో వెనక్కి ఇవ్వాలని విద్యార్థుల కుటుంబాలను ఆదేశించామని పోలీసులు చెప్పారు.
స్థానిక పోలీసులు మాట్లాడుతూ.. కేసులో ప్రస్తుతం కొంత పురోగతి వచ్చిందని, వ్యాపారి కొడుకు స్నేహితుల వివరాలు తీసుకున్నామని, ఇప్పటికి పదిహేను లక్షల రూపాయల వరకు స్వాధీనం చేసుకున్నామని, విద్యార్థి ఎవరెవరికి డబ్బులిచ్చాడో వాళ్ల తల్లిదండ్రులకు ఇప్పటికే సమన్లు అందించామని, అయిదు రోజుల్లోగా డబ్బును తిరిగి చెల్లించాలని ఆదేశించామని, ఇందులో ప్రమేయం ఉన్న వారిపై ఇంతవరకు కేసు నమోదు చేయలేదన్నారు.