రూ.2000నోట్లు ఎక్కడికి పోతున్నాయి?, పెద్ద కుట్రే జరుగుతోంది: మధ్యప్రదేశ్ సీఎం
భోపాల్ : మార్కెట్లో రూ.2000 నోట్లు అదృశ్యమైపోతున్నాయని మధ్యప్రదేశ్ సీఎం శివ్రాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. దీని వెనకాల పెద్ద కుట్రే జరుగుతోందని ఆయన ఆరోపించడం గమనార్హం.
షాజాపూర్ రైతుల సమావేశంలో చౌహాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.'డిమానిటైజేషన్కు ముందు రూ.15,00,000 కోట్ల విలువైన కరెన్సీ చలామణిలో ఉండేది. డిమానిటైజేషన్ తర్వాత కరెన్సీ సర్క్యూలేషన్ రూ.16,50,000 కోట్లకు పెరిగింది. కానీ రూ.2000 నోట్లు మాత్రం మార్కెట్ నుంచి కనిపించకుండా పోతున్నాయి' అని పేర్కొన్నారు.
'రూ.2000నోట్లు ఎక్కడికి పోతున్నాయి?, వాటి సర్క్యలేషన్ ను నియంత్రిస్తున్న బాధ్యులెవరు? దీనిపై మా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది' అని చౌహాన్ మండిపడ్డారు. కాగా, ఇటీవలి కాలంలో మధ్యప్రదేశ్ ప్రజలు తీవ్ర కరెన్సీ కష్టాలను ఎదుర్కొంటున్నారు.
'బిజినెస్ స్టాండర్డ్' సమాచారం ప్రకారం.. కరెన్సీ కష్టాలపై చర్చంచేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియాతో ఏప్రిల్ 11న సమావేశం నిర్వహించిందని తెలుస్తోంది.
రాష్ట్రంలో కొన్ని చోట్ల ఏటీఎంలలో నగదు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారన్నారు. ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం వద్దకు తీసుకెళ్లనున్నట్టు చౌహాన్ తెలిపారు. కరెన్సీపై కుట్ర వ్యాఖ్యలు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ను ఉద్దేశించినవే అన్న వాదన వినిపిస్తోంది.