ఎన్నికల వేడి: సీఎం బస్సు మీద వరుస రాళ్ల దాడులు, మాకు సంబంధం లేదు, కాంగ్రెస్!
భోపాల్: మధ్యప్రదేశ్ లో శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయాలు వేడేక్కాయి. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రయాణిస్తున్న హైటెక్ బస్సు మీద ప్రత్యర్థులు రాళ్లతో దాడి చెయ్యడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. సీఎం వాహనంపై రాళ్ల దాడితో మాకు ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ అంటోంది.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి జన ఆశీర్వాద్ యాత్ర పేరుతో శాసన సభ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. శాసన సభ ఎన్నికల్లో మళ్లీ మమ్మల్ని గెలిపించాలని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రచారం చేస్తున్నారు. రోత్లమ్ జిల్లాలోని కలుకేది సమీపంలో సోమవారం రాత్రి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రయాణిస్తున్న హైటెక్ బస్సు మీద రాళ్ల దాడి జరిగింది.
రాళ్ల దాడిలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ఎలాంటి గాయాలు కాకపోయినా బస్సు దెబ్బతింది. అయితే రాళ్ల దాడిలో ఇద్దరు పోలీసులకు గాయాలై మూడు పోలీసు జీపులు ధ్వంసం అయ్యాయి. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ బస్సు మీద రాళ్ల దాడి చేసిన వారిని వెంటనే గుర్తించి అరెస్టు చెయ్యాలని మధ్యప్రదేశ్ హోం శాఖ మంత్రి భూపేంద్ర సింగ్ ఆదేశాలు జారీ చేశారు.
రోత్లమ్ జిల్లా ఎస్పీ గౌరవ్ తివేరీ మీడియాతో మాట్లాడుతూ తాల్ పోలీసులు కేసు నమోదు చేసి రాళ్ల దాడి ఎవరు చేశారు అని విచారణ చేస్తున్నారని అన్నారు. రాళ్ల దాడిలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ఎలాంటి గాయాలు కాలేదని ఎస్పీ గౌరవ్ తివేరీ స్పష్టం చేశారు.
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కమల్ నాథ్ మీడియాతో మాట్లాడుతూ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సింగ్ ప్రయాణిస్తున్న బస్సు మీద జరిగిన రాళ్ల దాడిని తీవ్రంగా ఖండించారు. ఇలాంటి సంఘటనలు జరగడం దారుణం అని విచారం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీలను నేవర్చకపోవడం వలనే ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, రాళ్ల దాడితో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కమల్ నాథ్ స్పష్టం చేశారు. బీజేపీ పాలనపై ప్రజలు విసిగిపోయి ఇలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని కమల్ నాథ్ అన్నారు.
సెప్టెంబర్ 2వ తేదీ సింధి జిల్లాలోని పాతపర ప్రాంతంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రయాణిస్తున్న బస్సు మీద రాళ్లదాడి జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావాలనే తన వాహనం మీద రాళ్ల దాడి చేస్తున్నారని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ ఆరోపిస్తున్నారు. సీఎం శివరాజ్ సింగ్ ప్రయాణించే ప్రాంతాల్లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.