క్లైమాక్స్కు ఎంపీ రాజకీయ డ్రామా.. అసెంబ్లీలో బలపరీక్షకు ముహుర్తం ఫిక్స్
మధ్యప్రదేశ్ లో వారం రోజులుగా సాగుతోన్న రాజకీయ సంక్షోభం క్లైమాక్స్ కు చేరింది. జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటుతో ఇరుకునపడ్డ కమల్నాథ్ సర్కారు ఎట్టకేలకు అమీతుమీకి రెడీ అయింది. సంక్షోభానికి ముగింపు చర్యగా సోమవారం అసెంబ్లీలో బలపరీక్ష చేపట్టాలని స్పీకర్ నర్మదా ప్రసాద్ ప్రజాపతిని గవర్నర్ లాల్జీ టాండన్ ఆదివారం ఆదేశాలు జారీచేశారు.
బలపరీక్ష డిమాండ్ తో మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో బీజేపీ నేతలు గవర్నర్ ను కలిసిన కొద్ది గంటలకే ఆ మేరకు రాజ్ భవన్ నుంచి ప్రకటన వెలువడటం గమనార్హం. బలపరీక్షకు ముహుర్తం ఖరారు కావడంతో ఆయా వర్గాల ఎమ్మెల్యేలు భోపాల్ బాటపట్టారు. బీజపీ బేరసారాలకు భయపడి కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలను జైపూర్ కు తరలించగా, వాళ్లంతా ఆదివారం నాటికి భోపాల్ చేరుకున్నారు.
బెంగళూరులో మకాం వేసిన జ్యోతిరాదిత్య వర్గం ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ ప్రారంభమయ్యే సమయంలోగా భోపాల్ చేరుకుంటారని బీజేపీ నేతలు తెలిపారు. అయితే రాజీనామాలకు సంబంధించి ఆదివారం సాయంత్రంలోగాతన ముందు హాజరుకావాలంటూ స్పీకర్.. 22 మంది రెబల్ ఎమ్మెల్యేలను ఆదేశించారు. ఒకవేళ వాళ్లు రాకపోతే బలపరీక్ష వాయిదాపడే అవకాశాలు కూడా లేకపోలేవు.
మరోవైపు బీజేపీ కూడా చివరినిమిషంలో ఎమ్మెల్యేలు జారిపోకుండా ఎత్తులు సిద్ధం చేసింది. సోమవారం నాటి బలపరీక్షకు సంబంధించి ఆదివారంనాడే విప్ జారీచేసింది. మొత్తం 230 స్థానాలున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 116కాగా, సింధియా వర్గానికి చెందిన 22 మందిలో చాలా మంది కమల్ నాథ్ సమర్థకులున్నారని, అంతా కలుపుకుంటే ప్రస్తుతానికి తమకు 112 మంది ఎమ్మెల్యేల బలం ఉందని కాంగ్రెస్ నేతలు చెప్పారు.