సింధియా ఎమ్మెల్యేలకు స్పీకర్ ఝలక్.. బీజేపీ ‘బలపరీక్ష’ వ్యూహానికి కాంగ్రెస్ చెక్.. మధ్యప్రదేశ్లో
మధ్యప్రదేశ్ లో రాజకీయ సంక్షోభం అనేక మలుపులు తిరుగుతోంది. జ్యోతిరాదిత్య సింధియా ద్వారా 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చీల్చి, కమల్ నాథ్ సర్కారును కూల్చాలనుకున్న బీజేపీ.. ఈ నెల 16న అసెంబ్లీలో బలపరీక్ష జరిగేలా నోటీసులు ఇచ్చేందుకు రెడీ అయింది. ఎమ్మెల్యేల రాజీనామాలతో మైనార్టీలో పడిపోయిన సీఎం కమల్ నాథ్ సైతం సర్కారును కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రస్తుతం బెంగళూరులోని ఓ రిసార్ట్స్ లో మకాం వేసి.. ప్రత్యేక విమానంలో రాజీనామాలు పంపిన సింధియా వర్గీయులైన 22 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ ప్రజాపతి గట్టి షాకిచ్చారు. రాజీనామాపై లేఖలు పంపితే సరిపోదని, శుక్రవారంలోగా తన ముందు ప్రత్యక్షంగా హాజరుకావాలంటూ రెబల్ ఎమ్మెల్యేలను ఆయన ఆదేశించారు. ఈ మేరకు మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం గురువారం.. 22 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు పంపింది. రాజీనామాలు స్వచ్ఛందంగా చేసినవా? లేక ఎవరైనా బలవంతంగా చేయించారా అనే విషయాన్ని రూఢీ చేసుకున్న తర్వాతే వాటిని అంగీకరించాలా? వద్దా? అని స్పీకర్ నిర్ణయిస్తారని ప్రకటనలతో తెలిపారు.
మరోవైపు మైనార్టీలో పడిపోయిన కమల్ నాథ్ సర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈనెల 16లోగా ఫ్లోర్ టెస్టు నిర్వహించాలని పట్టుపడుతోన్న కమలనాథులు.. ఆ మేరకు స్పీకర్ ను కలవనున్నారు. అయితే బలపరీక్ష తప్పదంటూ వస్తున్న వార్తల్ని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ కొట్టిపారేశారు. ఎమ్మెల్యేల రాజీనామాలు స్పీకర్ దగ్గర పెండింగ్ లో ఉండగా, బలపరీక్షకు అవకాశమేలేదని, ఒక్కసారి బీజేపీ బందిఖానా నుంచి బయటికొచ్చిన తర్వాత కాంగ్రెస్ రెబల్స్ తిరిగి కమల్ నాథ్ చెంతకు వస్తారన్న నమ్మకం ఉందని దిగ్విజయ్ దీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి, కమల్ నాథ్ సర్కారును ప్రమాదంలోకి నెట్టేసిన జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరిన తర్వాత తొలిసారి సొంత రాష్ట్రానికి వచ్చారు. గురువారం భోపాల్ ఎయిర్ పోర్టు వద్ద బీజేపీ శ్రేణులు సింధియాకు ఘనస్వాగతం పలికారు. సిటీలో భారీ ర్యాలీ తీశారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
బీజేపీలోకి సింధియా చేరికపై ఆయన మిత్రుడు, కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు. జ్యోతిరాదిత్య నిత్యం రాజకీయ భవిష్యత్తు గురించి ఆందోళన చెందేవాడని, దాని కోసమే భావజాలానికి తిలోదకాలిచ్చిమరి ఆర్ఎస్ఎస్ పంచన చేరానని, ఇది కచ్చితంగా పచ్చి అవకాశవాద ధోరణే అని రాహుల్ విమర్శించారు.