దళిత యువతిపై గ్యాంగ్రేప్: నాలుగు నెలల పిండంతో ఎస్పీకి ఫిర్యాదు
భోపాల్: అత్యాచారానికి గురైన ఓ దళిత యువతి అబార్షన్ చేసిన నాలుగు నెలల పిండంతో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తనకు జరిగిన అన్యాయాన్ని బయటకు చెప్పకుండా ఉండేందుకు గాను బాధితురాలిని నిందితులు బెదిరించారని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సత్నా జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకొంది. ఓ దళిత మహిళపై కొన్ని నెలలుగా నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు.
బాధితురాలు గర్భం దాల్చింది. దీంతో ఓ నర్సు సహయంతో బాధితురాలికి అబార్షన్ చేయించారు. నాలుగు మాసాల వయస్సున్న పిండాన్ని ఓ సంచిలో వేసుకొని బాధితురాలు సత్నాలోని ఎస్పీ పాండే కార్యాలయంలో ఫిర్యాదు చేసింది.
సత్నాకు చెందిన నీరజ్ పాండే, ధీరజ్ పాండే, ప్రేమ్ కుమార్, రాజ్కుమార్లు తనపై కొన్ని నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సప్నా అనే నర్సు సాయంతో తనకు బలవంతంగా అబార్షన్ చేయించారని వెల్లడించింది. ఈ విషయం బయట ఎక్కడైనా చెబితే చంపేస్తామని బెదిరించారంది.
బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా నిందితులపై ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదుచేశామని, దోషుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని సత్నా నగర ఎస్పీ వీడీ పాండే ప్రకటించారు.అయితే నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని పోలీసులు చెప్పారు. వారి కోసం గాలింపు చర్యలను చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు.