మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం- సర్కారీ ఉద్యోగాలన్నీ స్ధానికులకే
దేశవ్యాప్తంగా స్ధానికత నినాదం ప్రభావం అంతకంతకూ పెరుగుతోంది. గతంలో తెలంగాణ, మహారాష్ట్ర, అసోం వంటి కొన్ని చోట్ల మాత్రమే వినిపించే స్ధానికత ప్రభావం ఆ తర్వాత ఏపీ, కర్నాటక, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలకు విస్తరించినట్లు కనిపిస్తోంది. ఏపీలో స్ధానిక యువతకు పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు కల్పిస్తూ వైసీపీ సర్కారు ఓ చట్టాన్నే తీసుకొచ్చింది.
అనంతరం కర్నాటలో యడ్యూరప్ప సర్కారు కూడా ఇదే బాటలో పయనించింది. కరోనాకు ముందే మహారాష్ట్రలోని ఉద్ధవ్ థాక్రే సర్కారు కూడా స్ధానికులకు ఉద్యోగాలపై తీర్మానం చేసింది. ఇప్పుడు మధ్యప్రదేశ్లోని శివరాజ్సింగ్ సర్కారు అయితే వీటన్నంటికీ మించి పోయే సంచలన నిర్ణయం తీసుకుంది.
మధ్యప్రదేశ్లో అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను స్ధానికులకే కట్టబెడుతూ అక్కడి శివరాజ్సింగ్ చౌహాన్ ఆధ్వర్వంలోని బీజేపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై ప్రభుత్వం ఏ ఉద్యోగం భర్తీ చేయాలన్నా స్ధానికతను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుంటుంది. రాష్ట్రంలోని అన్ని వనరులు స్ధానికులకే దక్కాలని భావిస్తున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం శివరాజ్సింగ్ ఇవాళ ప్రకటించారు. ఈ నిర్ణయం అమలుకు అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు త్వరలో తీసుకుంటామన్నారు.
మధ్యప్రదేశ్ కంటే ముందే స్ధానిక కోటా ఉద్యోగాలపై నిర్ణయాలు తీసుకున్న కర్నాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై ఇంకా చట్టాల రూపకల్పన దశలోనే ఉన్నాయి. ఏపీలోని వైసీపీ సర్కారు మాత్రం ఇప్పటికే చట్టం చేసి అసెంబ్లీ ఆమోదం కూడా పొందింది. అయితే మహారాష్ట్ర, కర్నాటకలో మాత్రం వివాదాలు కొనసాగుతున్నాయి. చట్టపరమైన అడ్డంకులు కూడా ఉంటాయి. అయితే వీటిని శివరాజ్సింగ్ చౌహాన్ సర్కారు ఎలా అధిగమిస్తుందో చూడాల్సి ఉంది.