బలనిరూపణకు గవర్నర్ డెడ్లైన్: ‘మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సర్కారును కరోనా కూడా కాపాడలేదు’
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు రాజీనామా చేయడంతో సంక్షోభంలో పడిన విషయం తెలిసిందే. సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు కరోనావైరస్ భయాందోళనల నేపథ్యంలో మార్చి 26 వరకు వాయిదా పడిన విషయం తెలిసిందే.
కమల్నాథ్ సర్కారుకు 24గంటల డెడ్ లైన్
అసెంబ్లీ స్పీకర్ ఈ మేరకు నిర్ణయం తీసుకోవడంతో మధ్యప్రదేశ్ కమల్ నాథ్ ప్రభుత్వ కాస్త ఊపిరి పీల్చుకుంది. అయితే, కొద్దిగంటల్లోనే ఆ రాష్ట్ర గవర్నర్ లాల్జీ టాండన్ కాంగ్రెస్ ప్రభుత్వానికి షాకిచ్చారు. మంగళవారంలోగా అసెంబ్లీలో బల పరీక్ష నిర్వహించాలని ఆదేశించారు. లేకుంటే ప్రభుత్వం మైనార్టీలో పడిందని పరిగణించాల్సి వస్తుందని తేల్చి చెప్పారు. ఈ మేరకు సీఎంకు ఆయన లేఖ రాశారు.
కాంగ్రెస్ సర్కారును కరోనా కూడా కాపాడలేదు..
ఇది ఇలావుండగా, బీజేపీ నేత, మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కమల్నాథ్ ప్రభుత్వాన్ని కరోనావైరస్ కూడా కాపాడలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న తాజా పరిణామాల నేపథ్యంలో గవర్నర్ను కలిశారాయన. అంతేగాక, 107 మందికి గాను 106 మంది బీజేపీ ఎమ్మెల్యేలు రాజ్ భవన్లో గవర్నర్ ఎదుట పరేడ్ నిర్వహించారు.
మైనార్టీలో కాంగ్రెస్ ప్రభుత్వం..
అనంతరం శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. మెజార్టీ లేదని తెలిసి సీఎం కమల్ నాథ్ బల నిరూపణ పరీక్ష నుంచి పారిపోతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో పడిందనీ.. అధికారంలో కొనసాగే హక్కు లేదన్నారు. బీజేపీకే మెజార్టీ ఉందని, త్వరగా బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్కు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. రాజ్యాంగ హక్కులను పరిరక్షిస్తామని గవర్నర్ తమకు హామీ ఇచ్చారని ఈ మాజీ సీఎం చెప్పారు. జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన నేపథ్యంలో ఆరుగురు మంత్రులతోపాటు 22 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.