అగ్నిపరీక్ష జరిగిన చోటే సీతాదేవికి ఆలయం.. శ్రీలంకలో భారీ నిర్మాణానికి ఎంపీ సర్కారు ఆమోదం..
రామజన్మభూమి అయోధ్యలో ఆకాశమంత ఎత్తైన ఆలయాన్ని నిర్మిస్తామని బీజేపీ ప్రభుత్వాలు చెబుతున్న తరుణంలో.. తామేమీ తక్కువకాదంటూ కాంగ్రెస్ ప్రభుత్వాలూ సీతాదేవి ఆలయానికి సంబంధించిన సంచలన ప్రకటన చేశాయి. రామాయణ గాథలో చెప్పినట్లు... సీతాదేవి ఏ ప్రదేశంలోనైతే అగ్నిప్రవేశం చేసిన సచ్ఛీలురాలిగా బయటికొచ్చిందో.. అదే చోట భారీ ఆలయాన్ని నిర్మించబోతున్నట్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది.
బీజేపీ మాట.. కాంగ్రెస్ చేత..
నిజానికి సీతమ్మ అగ్నిప్రవేశం చేసిన ప్రాంతంలో ఆలయం నిర్మించాలన్నది బీజేపీ ఐడియానే. శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ మేరకు ప్రయత్నాలు చేసింది. కానీ కార్యాచరణ ముందుకు సాగలేదు. 2018లో కమల్ నాథ్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్లీ ఈ ప్రాజెక్టు ముందుకు కదిలింది. దీనిపై సీఎం కమల్ నాథ్ సోమవారం అధికార ప్రకటన చేశారు.
ఇంతకీ ఎక్కడుందా ప్రదేశం?
రామాయణం ప్రకారం.. శ్రీరాముడు యుద్ధంలో రావణ్నుంచి సహరించిన తర్వాత సీతను తిరిగి తీసుకొచ్చే క్రమంలో ఈ ఘట్టం చోటుచేసుకుంది. శ్రీలంక సెంట్రల్ ఫ్రావిన్స్ లోని ‘దివురుంపోలా' ప్రాంతమే సీతాదేవి అగ్నిప్రవేశానికి వేదికైందని స్థానికులు కూడా విశ్వసిస్తారు. దీనికి సంబంధించిన చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. శ్రీలంకలో రామాయణంతో ముడిపడి ఉన్న అన్ని ప్రాంతాల్లాగే ‘దివురుంపోలా‘ను కూడా టూరిస్టులు దర్శించుకుంటారు. ఈ చోటుకు అతి సమీపంలోనే ఓ బౌద్ధ మఠం కూడా ఉంది.
లంక సహకారంతోనే..
సీతాదేవి అగ్నప్రవేశం చేసిన చోట తలపెట్టిన భారీ ఆలయాన్ని శ్రీలంక ప్రభుత్వ సహకారంతోనే నిర్మించనున్నట్లు మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ చెప్పారు. రాష్ట్ర న్యాయ, మత వ్యవహారాల శాఖ మంత్రి పీసీ శర్మ ఇటీవలే శ్రీలంకలో పర్యటించి గుడికి సంబంధించిన వ్యవహారాల్ని చక్కబెట్టారని, శ్రీలంక ప్రెసిడెంట్ రాజపక్సతోనూ ప్రత్యేకంగా భేటీ అయ్యారని కమల్ నాథ్ తెలిపారు.
బడ్జెట్ కేటాయింపు..
10 ఏళ్ల కిందటే సీతాదేవి ఆలయ నిర్మాణానికి ప్రపోజల్ వచ్చినా, బీజేపీ సర్కార్ కావాలని కాలయాపన చేసిందని సీఎం కమల్ నాథ్ ఆరోపించారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం, శ్రీలంక ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టబోయే నిర్మాణానికి మహాబోధి సొసైటీ సహకారాన్ని కూడా తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే ఈ ప్రాజెక్టుకు నిధులు కూడా కేటాయిస్తామని, అతి త్వరలోనే ఆలయ నిర్మాణాన్ని పూర్తిచేస్తామని మధ్యప్రదేశ్ సీఎం తెలిపారు.