నిరుపేద ఎమ్మెల్యే, వింటే షాకవుతారు: పూరిగుడిసెలో ఉంటున్న ఎమ్మెల్యేకు ఇల్లు కట్టిస్తున్న ప్రజలు
భోపాల్: మధ్యప్రదేశ్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నుంచి గెలిచిన ఓ ప్రజాప్రతినిధి (ఎమ్మెల్యే)కు కనీసం ఇల్లు కూడా లేదు. ఆయన తన భార్యతో గుడిసెలోనే జీవిస్తున్నారు. ఆయన గెలిచి రెండు నెలలు అయినా వేతనం రాలేదు. దీంతో ఆయన భార్యతో గుడిసెలో జీవిస్తున్నారు. ఓ ఎమ్మెల్యే గుడిసెలో జీవించడం అందరినీ కలవరపరిచింది.
దీంతో అక్కడే ఉన్న ఆ పార్టీకి చెందిన వారు, ఇతర స్థానికుల ఆయనకు ఇల్లు కట్టించేందుకు ముందుకు వచ్చారు. ఆయనకు కనీసం సొంతిల్లు నిర్మించుకునే స్థోమత లేదు. దీంతో స్థానికులు చందాలు వేసుకొని మరీ ఆయనకు ఇంటిని నిర్మిస్తున్నారు.
భార్యతో కలిసి పూరిగుడిసెలో బీజేపీ ఎమ్మెల్యే
గత ఏడాది (2018) నవంబర్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మధ్యప్రదేశ్లో కూడా ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో షియోపూర్ జిల్లా విజయ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున సీతారామ్ ఆదివాసి గెలుపొందారు. ఆయన వయస్సు 55 ఏళ్లు. ఆయన ఎమ్మెల్యేగా గెలవడం ఇదే మొదటిసారి. ఎమ్మెల్యేగా గెలిచి నెలన్నర దాటింది. కానీ ఇంకా వేతనం అందుకోలేదు. అంతేకాదు, పేదవారు. దీంతో భార్యతో కలిసి పూరి గుడిసెలో ఉంటున్నారు.
చందాలు వేసుకొని ఇల్లు కట్టిస్తున్నారు
ఈ నేపథ్యంలో ప్రజలు ఆయనకు ఇల్లు కట్టించేందుకు ముందుకు వచ్చారు. చందాలు వేసుకుని సీతారామ్కు ఇల్లు నిర్మిస్తున్నారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకారం ఒక్కో ఎమ్మెల్యేకు నెలకు రూ.1 లక్ష 10వేల వేతనం వస్తుంది. తమ ఎమ్మెల్యే పూరి గుడిసెలో ఉండటం చూడలేకే పక్కా ఇల్లు కట్టిస్తున్నట్లు పలువురు చెప్పారు.
సిగ్గుగా అనిపించింది... అందుకే విరాళాలు
తమ ఎమ్మెల్యే గుడిసెలో జీవించడం తమకు సిగ్గుగా అనిపించిందని, ఆయన ఉన్న ప్రాంతం చాలా దారుణంగా ఉందని, అందుకే తాము ఇవ్వాలనుకున్న వారి నుంచి డబ్బులు తీసుకొని రెండు గదుల ఇళ్లు నిర్మిస్తున్నామని ధనరాజ్ అనే స్థానికుడు చెప్పారు. ఆయన తమ కోసం ఎంతో చేశారని, కష్టాల్లో తమకు అండగా నిలిచారన్నారు. అందుకే విరాళాలు వసూలు చేసి ఇల్లు కట్టిస్తున్నామన్నారు.
నిరుపేద ఎమ్మెల్యే
దీనిపై ఎమ్మెల్యే సీతారాం ఆదివాసి మాట్లాడుతూ... తమకు ఇంటి కోసం ప్రజలు రూ.100 నుంచి రూ.1000 వరకు విరాళంగా ఇస్తున్నారని చెప్పారు. తమది చాలా పేద కుటుంబం అన్నారు. తాను ఎన్నికల్లో గెలిచినప్పుడు తన నియోజకవర్గ ప్రజలు నాణేలతో తనకు తులాభారం వేశారని, ఆ డబ్బుతోనే పూరిగుడిసె నిర్మించుకున్నానని చెప్పారు. ఇప్పుడు ప్రజలు తనకు ఇల్లు కట్టించడం ఆనందంగా ఉందన్నారు. నేను జీతం అందుకున్న తర్వాత ఆ డబ్బును పేద ప్రజల సంక్షేమం కోసం ఉపయోగిస్తానని చెప్పారు.