ఒక వజ్రం జీవితాన్నే మార్చేసింది: ప్రజాపతి అయ్యాడు కరోడ్ పతి
Recommended Video
అదృష్టం అనేది అందరికీ దక్కదు. ఒకే ఒకసారి అది తలుపుతడుతుంది. దీంతో జీవితమే మారిపోతుంది. అలాంటి జాక్పాటే తగిలింది మధ్యప్రదేశ్లో నివసిస్తున్న మోతీలాల్ ప్రజాపతి అనే వ్యక్తికి. ఇప్పటి వరకు రెక్కాడితే డొక్కాడని కుటుంబం తనది. నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లాలంటే రోజంతా కష్టపడాల్సిందే. ఇకపై ప్రజాపతికి ఆ బాధ ఆ కష్టం ఉండదు. ఎందుకంటే ప్రజాపతి ఇప్పుడు కరోడ్ పతి అయ్యాడు.
లీజుకు తీసుకున్న భూమిలో వజ్రం
మధ్యప్రదేశ్ బుందేల్ఖండ్ ప్రాంతంలో నివాసముంటున్న 50 ఏళ్ల మోతీలాల్ ప్రజాపతి 25 చదరపు అడుగులు స్థలాన్ని కృష్ణ కల్యాణ్ పూర్ పట్టి గ్రామంలో లీజుకు తీసుకున్నాడు. అది వజ్రాల మైనింగ్ పన్నా పరిధిలో ఉంది. గత నెల 20న భూమిని లీజుకు తీసుకున్నాడు. ఈ భూమి ఏ ముహూర్తంలో లీజుకు తీసుకున్నాడో ఏమో తెలియదుగానీ అదృష్టం మాత్రం పడిశం పట్టినట్లు పట్టింది. మోతీలాల్ ప్రజాపతికి ఆ భూమి ఉన్న చోటులో ఒక వజ్రం దొరికింది. దీంతో ఒక్కసారి షాక్కు గురయ్యాడు.
భగవంతుడి చల్లని చూపుతోనే అదృష్టం వరించింది
నా అదృష్టాన్ని నమ్మలేకపోతున్నాను అని ప్రజాపతి అన్నాడు. మూడు తరాల వారు అంటే తన తాత, తన తండ్రి, ఇప్పుడు తను ... ఈ ప్రాంతంలో భూమిని లీజుకు తీసుకుంటున్నామని అయితే ఎప్పుడూ తమకు వజ్రాలు దొరకలేదని చెప్పాడు. భగవంతుడు ఇంతకాలానికి తనపై కరుణ చూపాడని అందుకే ఈ వజ్రం దొరికిందని చెప్పాడు. ఈ డబ్బుతో తన కష్టాలన్నీ గట్టెక్కుతాయని ఆనందంతో చెప్పాడు ప్రజాపతి. ఈ డబ్బుతో తన పిల్లలను పై చదువులు చదివిస్తానని చెప్పిన ప్రజాపతి, ఉండేందుకు ఒక సొంత ఇళ్లు, తన సోదరుడి పిల్లల పెళ్లిళ్లు కూడా చేస్తానని చెప్పాడు.
అత్యధిక ధర కలిగిన వజ్రం దొరకటం వజ్రాల మైనింగ్ చరిత్రలో తొలిసారి
ఇదిలా ఉంటే ప్రజాపతికి దొరికిన వజ్రం 42.59 కేరట్లు ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వ పరిధిలో జరిగే వజ్రాల మైనింగ్ చరిత్రలోనే ఇంతటి ధర పలికే వజ్రం దొరకడం తొలిసారని అధికారులు తెలిపారు. అయితే 1961లో 44.55 కేరట్ల వజ్రం కచువాటోలా ప్రాంతంలో రసూల్ అహ్మద్ అనే వ్యక్తికి దొరికిందని సంతోష్ సింగ్ అనే అధికారి వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న వజ్రాల గనుల్లో ప్రస్తుతం ఒక్క పన్నా జిల్లాలోని వజ్రాల గని మాత్రమే ఇంకా యాక్టివ్గా ఉంది. అక్కడ కార్యకలాపాలు ఇంకా జరుగుతున్నాయి. ఎన్డీఎంసీ ఆధ్వర్యంలో ఈ కార్యకలాపాలు జరుగుతున్నాయి.
కలెక్టర్ కార్యాలయంలో వజ్రం
ఇక ప్రజాపతికి దొరికిన వజ్రం విలువ రూ.1.50 కోట్లు ఉంటుందని అంచనా వేశారు వజ్రాల వ్యాపారులు . ప్రస్తుతం వజ్రం కలెక్టర్ కార్యాలయంలో ఉంది. ఆ వజ్రాన్ని వేలం వేసి అనంతరం వచ్చిన డబ్బునుంచి 11శాతం పన్ను కట్టించుకుని మిగతా డబ్బును మోతీలాల్ ప్రజాపతికి ఇచ్చేస్తామని కలెక్టర్ తెలిపాడు. ఇదిలా ఉంటే గతనెలలో ప్రకాష్ కుమార్ శర్మ అనే రైతుకు కూడా 12.58 కేరట్ల వజ్రం దొరికింది. దీని విలువ రూ.30 లక్షలుగా ఉంటుందని నిపుణులు తెలిపారు. 2011లో 16.3 కేరట్ల వజ్రం శంభు దయాల్ ఖాదర్కు దొరికింది. 2014లో అనన్ సింగ్ యాదవ్కు 12.93 కేరట్ల వజ్రం దొరికింది.