తల్లికి అనారోగ్యమని నమ్మించి కూతురిని హత్య చేసిన తండ్రి, ఎందుకంటే?
భోపాల్:కులాంతర వివాహం చేసుకొన్న తన కూతురును ఓ తండ్రి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖేతియాలో గురువారం నాడు చోటు చేసుకొంది. కూతురును చంపిన తర్వాత నిందితుడు పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు.మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
మధ్యప్రదేశ్లోని ఖేతియాకు చెందిన సర్లా మాలి (24) అనే యువతిని పక్క గ్రామానికి చెందిన పంకజ్ అనే యువకుడు ప్రేమించాడు. అయితే పంకజ్ది వేరే కులం. వేరే కులం కావడంతో పంకజ్తో వివాహానికి సర్లా మాలి కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు.
దాంతో సర్లా ఇంటి నుంచి వెళ్లిపోయి పంకజ్ను వివాహం చేసుకుంది. పెళ్లైన తర్వాత పంకజ్ గ్రామంలోనే దంపతులు నివాసం ఉంటున్నారు. దీంతో సర్లా మాలి కుటుంబసభ్యులకు నచ్చలేదు. వేరే కులానికి చెందిన పంకజ్ ను పెళ్ళి చేసుకొని తమ కుటుంబం పరువును తీసిందని కూతురిని చంపాలని కుటుంబసభ్యులు నిర్ణయం తీసుకొన్నారు.
పథకం ప్రకారంగా సర్లా మాలి కుటుంబసభ్యులు ఆమె వద్దకు వచ్చి తల్లిక ఆరోగ్యం బాగాలేదని నమ్మించి తమ ఇంటికి తీసుకొచ్చారు. తమ పరువును తీసిందనే అక్కసుతో సర్లా మాలిని కత్తితో నరికి చంపారు. ఈ ఘటనకు సంబంధించి సర్లా మాలి తండ్రి దేవిదాస్ కోలిని పోలీసులు అరెస్ట్ చేశారు. సర్లా మాలి తల్లి తుల్సీబాయి, సోదరుడు హీరాలాల్ పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.