ఇక పాల ధరలు పెరగనున్నాయ్: సహకార సంఘాల నిర్ణయం: ఇదివరకెప్పుడూ లేనంతగా రేటు
భోపాల్: దేశంలో రోజురోజుకూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతోన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ రేటు లీటర్ ఒక్కింటికీ 100 రూపాయలను దాటేసింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు నియంత్రణలోనే ఉన్నప్పటికీ.. దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు యథేచ్ఛగా పరుగెడుతున్నాయి. తాజాగా- వంటగ్యాస్ సిలిండర్ ధర కూడా వాటితో పోటీ పడుతోంది. వంటగ్యాస్ సిలిండర్ రేటును చమురు సంస్థలు 25 రూపాయల మేర పెంచాయి. ఈ ఒక్క నెలలోనే 100 రూపాయల మేర పెరుగుదల కనిపించింది.
నిత్యావసర సరుకుల రవాణాపై
ధరలను నియంత్రించడంపై కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం దృష్టి పెట్టట్లేదనేది స్పష్టమౌతోంది. పెట్రోల్, డీజిల్ రేట్ల పెరుగుదల ప్రభావం.. రవాణా రంగంపై తీవ్రంగా పడుతోంది. పెట్రోల్తో పోటీ పడుతూ డీజిల్ రేట్లు పెరుగుతోండటం వల్ల వాణిజ్యావసరాల కోసం వినియోగించే వాహనాలు కుదేల్ అవుతున్నాయి. నిత్యావసర సరుకులు, కూరగాయలు, పాలను రవాణా చేసే వాహనాలపై పెనుభారం మోపినట్టయింది. వాటి రవాణా ఖర్చు తడిసి మోపెడవుతోంది.
మధ్యప్రదేశ్ పాడి రైతులు నిర్ణయం..
పాలను రవాణా చేయడానికి అవసరమయ్యే ఖర్చును పాల ఉత్పత్తిదారుల నుంచే వసూలు చేయాల్సి వస్తోంది. ఫలితంగా- అదనపు భారాన్ని భరించలేక పాల ఉత్పత్తిదారులు, పాడి రైతులు రేట్లను పెంచడానికి సిద్ధపడుతున్నారు. మార్చి 1 నుంచి పాల రేట్లను పెంచాలని నిర్ణయించుకున్నారు. ప్రత్యేకించి- మధ్యప్రదేశ్లోని పాల ఉత్పత్తి సహకార సంఘాల ప్రతినిధులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పెరిగిన పెట్రోల్, డీజిల్, ఇతర నిర్వహణ వ్యయానికి అనుగుణంగా పాల రేట్లను పెంచాలని తీర్మానించుకున్నారు.
లీటర్కు రూ.12
లీటర్ ఒక్కింటికి 12 రూపాయల మేర పెంచాలని ప్రాథమికంగా నిర్ణయించారు. పెరిగిన పాల రేట్లను వచ్చేనెల 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకుని రావాలని భావిస్తున్నారు. ఈ మేరకు మధ్య ప్రదేశ్ ప్రభుత్వానికి ఓ వినతిపత్రాన్ని అందజేసినట్లు చెబుతున్నారు. దీనికి ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది. పాల రేట్లను పెంచాలని తాము నిర్ణయం తీసుకున్నామని, పెంపు తప్పకపోవచ్చని రత్లామ్ పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు హీరాలాల్ చౌధరి తెలిపారు. పాల రేట్లను పెంచాలని తాము గత ఏడాది నుంచి డిమాండ్ చేస్తోన్నామని, కరోనా వైరస్ వ్యాప్తి దాన్ని వాయిదా వేసుకోవాలని ప్రభుత్వం సూచించిందని చెప్పారు.
ప్రభుత్వం మీదే భారం..
తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పాల ధరను పెంచక తప్పట్లేదని వివరించారు. పెరిగిన రేట్ల వల్ల పాడి పరిశ్రమ నిర్వహణ కష్టతరమౌతోందని చెప్పారు. ప్రస్తుతం లీటర్ పాలకు 43 రూపాయలను వసూలు చేస్తోన్నామని దీన్ని 55 రూపాయలకు పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించామని చెప్పారు. ప్రభుత్వం ఆమోదిస్తుందని తాము ఆశిస్తున్నామని హీరాలాల్ చౌధరి అన్నారు. పెంచకపోతే పాడిపరిశ్రమను నిర్వహించడం కష్టమని తేల్చి చెప్పారు.