మరో గ్యాంగ్రేప్: మంచినీళ్లు అడిగి.. పొలాల్లోకి లాక్కెళ్లి: మైనర్ బాలికపై: ప్రాణాపాయ స్థితిలో
భోపాల్: ఉత్తర ప్రదేశ్లో 19 సంవత్సరాల దళిత యువతిపై సామూహిక అత్యాచార ఘటన రగిల్చిన వేడి ఇంకా చల్లారలేదు. రెండువారాల పాటు బాధితురాలు మృత్యువుతో పోరాడుతూ మరణించిన ఉదంతం మిగిల్చిన ప్రకంపనలు ఇంకా తగ్గలేదు. బాధితురాలి చితిమంటలు ఆరకముందే.. వరుసగా సామూహిక అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఉత్తర ప్రదేశ్లోని ఆజంగఢ్, బులంద్షెహర్, మధ్యప్రదేశ్లోని ఖర్గోవ్ జిల్లాల్లో కామాంధుల కిరాతకాలు వెలుగులోకి వచ్చాయి.
మంచినీళ్లు కావాలంటూ
మధ్యప్రదేశ్లోని ఖర్గోవ్ జిల్లా ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మంచినీళ్లు కావాలంటూ ఇంట్లోకి చొరబడిన ఈ కిరాతకులు..మైనర్ బాలికను పొలాల్లోకి లాక్కెళ్లారు. గ్యాంగ్రేప్కు ఒడిగట్టారు. అడ్డుకున్న ఆ బాలిక సోదరుడిని చితకబాదారు. ఆ దుర్మార్గుల చేతిలో కొన్ని గంటల పాటు ఆ బాలిక చిత్రవధను అనుభవించింది. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు చెబుతున్నారు. ఉత్తర ప్రదేశ్లోని హత్రాస్లో సామూహిక అత్యాచారానికి గురైన యువతి మరణించిన మరుసటి రోజే ఈ ఘటన చోటు చేసుకోవడం.. ప్రాధాన్యతను సంతరించుకుంది.
పొలంలో కట్టుకున్న గుడిసెలో
ఖర్గోవ్ జిల్లాలోని మరుగఢ్ గ్రామంలో ఈ కిరాతక ఘటన చోటు చేసుకుంది. బాధిత బాలిక తన సోదరుడితో కలిసి తమ పొలంలో కట్టుకున్న గుడిసెలో నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ముగ్గురు వ్యక్తులు రెండు బైక్లపై అక్కడికి చేరుకున్నారు. మంచినీళ్లు కావాలని అడిగారు. ఇంట్లో వారిద్దరే ఉండటంతో బరి తెగించారు. బాలిక సోదరుడిని చితకబాాదారు. ఆమెను పొలాల్లోకి లాక్కెళ్లారు. గ్యాంగ్రేప్కు పాల్పడ్డారు. వారి ఘాతుకానికి అడ్డుపడటానికి ప్రయత్నించిన బాలిక సోదరుడిని కర్రలతో చితకబాదారు.
బీజేపీ ప్రభుత్వంపై ఫైర్..
తన చెల్లిని రక్షించే ప్రయత్నంలో ఆమె సోదరుడు..మరుగఢ్ గ్రామస్తులను వెంటబెట్టుకుని రావడాన్ని గమనించిన ముగ్గురూ సంఘటనా స్థలం నుంచి బైక్లపై పారిపోయారు. గ్రామస్తులు బాలికను ఆసుపత్రికి తరలించారు. చైన్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన ఖర్గోవ్ జిల్లాలో తీవ్ర కలకలాన్ని రేపింది. ప్రతిపక్ష కాంగ్రెస్, ఇతర పార్టీల నాయకులు ఈ గ్యాంగ్రేప్ ఘటనపై అధికార బీజేపీ ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగుతున్నారు. బీజేపీల పాలనలో శాంతిభద్రతలు కరవు అయ్యాయని మండిపడుతున్నారు.
Recommended Video
ప్రకటన చేసిన ఎస్పీ
ఈ గ్యాంగ్రేప్ ఉదంతంపై ఖర్గోవ్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ శైలేంద్ర సింగ్ చౌహాన్ ఓ ప్రకటన చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలను చేపట్టామని, దీనికోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సంఘటనా స్థలంలో సీసీటీవీ కెమెరాలు లేవని, వారు ప్రయాణించిన మార్గంలో అమర్చిన ఫుటేజీల ద్వారా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే వారిని పట్టుకుంటామని చెప్పారు. నిందితులు వినియోగించిన రెండు బైక్లల్లో ఒకటి చోరీకి గురైనట్లు ఇదివరకు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని అన్నారు.