మధ్యప్రదేశ్లో ఆపరేషన్ కమల్: బీజేపీ టార్గెట్ అదేనా..? కాంగ్రెస్ రివర్స్ గేమ్ ఏంటి..?
భోపాల్: మధ్యప్రదేశ్లో ఆపరేషన్ కమల్ ప్రారంభమైంది. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 14 నెలలకు కమల్నాథ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కమలం పార్టీ పావులు కదుపుతోంది. అయితే ఇంతకాలం సైలెంట్గా ఉన్న కమలం పార్టీ ఒక్కసారిగా మధ్యప్రదేశ్పై కన్నేయడానికి కారణం ఏంటి..? వీరి టార్గెట్ ఏంటి..?
కమల్నాథ్ సర్కార్కు కమలం నుంచి ముప్పు?
మధ్యప్రదేశ్లో కమల్నాథ్ ప్రభుత్వంకు బీటలు పడేలా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్న బీజేపీ హైకమాండ్ ఒక్కసారిగా మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై కన్నేసింది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో టచ్లోకి వచ్చింది బీజేపీ. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు తమ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆపరేషన్ కమల్కు ధీటుగా ఆపరేషన్ పంజాను ప్రారంభించింది కాంగ్రెస్. ఈ క్రమంలోనే ఆరుగురు బీజేపీ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ టచ్లోకి వచ్చింది. గ్వాలియర్, చంబల్, బుందేల్ఖండ్ ప్రాంతాల నుంచి ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బీజేపీ టచ్లోకి వచ్చినట్లు సమాచారం. వీరంతా దిగ్విజయ్ సింగ్, జ్యోతిరాదిత్య సింధియా వర్గం వారని తెలుస్తోంది. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు ఢిల్లీలో ఉన్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ గేమ్ ప్లాన్ ఏంటి..?
ఇదిలా ఉంటే కాంగ్రెస్ కూడా తమ ఎమ్మెల్యేలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతోంది. ఈ క్రమంలోనే కొందరు ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకోవడంతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఎమ్మెల్యేలు చేజారకుండా ఉండేలా చూసుకోవాలని బాధ్యతను మంత్రులకు అప్పగించింది కాంగ్రెస్ హైకమాండ్. ఇక బీజేపీ ఎమ్మెల్యేలు ఆరుగురితో టచ్లో ఉంది కాంగ్రెస్. శరద్ కోల్, నారాయణ్ త్రిపాఠీలతో నేరుగా సీఎం కమల్నాథ్ మాట్లాడుతున్నట్లు సమాచారం. మరోవైపు చంద్లా ఎమ్మెల్యే రాజేష్ ప్రజాపతి, జైత్పూర్ ఎమ్మెల్యే మనీషా సింగ్, తికంఘడ్ ఎమ్మెల్యే రాకేష్ గిరి, బాంధవ్గడ్ ఎమ్మెల్యే శివనారాయణ సింగ్లతో కాంగ్రెస్ పార్టీ టచ్లో ఉన్నట్లు సమాచారం.
రాజ్యసభ సీట్ల కోసమే ఆపరేషన్ కమల్..?
త్వరలో రాజ్యసభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ఎలాగైనా సరే అక్కడి సీట్లను పొందాలని ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే బీజేపీ తనకు రూ.25 కోట్లతో పాటు మంత్రి పదవిని ఎర చూపిందని ఆరోపణలు చేశారు సబల్గఢ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బైజ్నాథ్ కుశ్వాహా. బీజేపీ నేత ప్రమోద్ శర్మ తనకు ఈ ఆఫర్ ప్రకటించారని చెప్పారు. అంతేకాదు తాను ఫోన్లో మాట్లాడిన మాటలు తన వద్ద రికార్డ్ ఉందని కూడా చెప్పారు.
దిగ్విజయ్ సింగ్ ఏం చెప్పారు..?
ఇదిలా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న బీఎస్పీ, ఎస్పీ ఎమ్మెల్యేలను బీజేపీ నేతలు ఢిల్లీకి తీసుకెళ్లారంటూ ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ట్వీట్ చేశారు. బీఎస్పీ ఎమ్మెల్యే రామ్బాయ్ను చార్టర్డ్ ఫ్లయిట్లో ఢిల్లీకి బీజేపీ ఎమ్మెల్యే భూపేంద్రసింగ్ తీసుకెళ్లారంటూ దిగ్విజయ్ ట్వీట్లో పేర్కొన్నారు. దీనిపై శివరాజ్ సింగ్ చౌహాన్ ఎలా స్పందిస్తారో వేచిచూస్తున్నట్లు వెల్లడించారు. అయితే కమల్నాథ్ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి రామ్బాయ్ కాంగ్రెస్కే మద్దతుగా నిలుస్తుందని తాను భావిస్తున్నట్లు దిగ్విజయ్ సింగ్ ట్వీట్ చేశారు.
బీజేపీ ఎప్పటికీ ఆ పని చేయదు: శివరాజ్ సింగ్ చౌహాన్
ఇక ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేస్తోందన్న వార్తలపై మాజీ ముఖ్యమంత్రి బీజేపీ నేత శివరాజ్ సింగ్ స్పందించారు. కాంగ్రెస్లో కొన్ని గ్రూపులు ఉన్నాయని ఒకరంటే ఒకరికి పడక ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నామనే నిందలు బీజేపీ వేయడం సరికాదన్నారు. బీజేపీ ఇలాంటి చర్యలకు ఎప్పుడూ పాల్పడదని ఇంతకుముందే స్పష్టం చేశామని ఇప్పుడు కూడా అదే చెబుతున్నామని శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు.