సీఎం సన్నిహితులకు ఐటీ దెబ్బ..! రెండో రోజు కంటిన్యూ.. 14.6 కోట్లు స్వాధీనం
భోపాల్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ సన్నిహితులే లక్ష్యంగా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజాము 3 గంటలకు మొదలైన సోదాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. రెండో రోజైన సోమవారం (08.04.8019) కూడా సీఎం సన్నిహితులు, అనుచరుల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు చేశారు. పెద్దమొత్తంలో నగదు, ఇతరత్రా స్వాధీనం చేసుకున్నారు.
ఇంకా కంటిన్యూ..! 14.6 కోట్లు స్వాధీనం
మధ్యప్రదేశ్ లో ఐటీ అధికారుల దాడులు కలకలం రేపుతున్నాయి. లోక్సభ ఎన్నికల వేళ సీఎం కమల్ నాథ్ సన్నిహితుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించడం హాట్ టాపికయింది. ఆదివారం తెల్లవారుజాము నుంచి మొదలైన ఐటీ వేట.. ఇంకా కంటిన్యూ అవుతున్నట్లు సమాచారం.
అయితే రెండో రోజైన సోమవారం నాటికి మొత్తం 14 కోట్ల 60 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు అధికారులు. ఈ నగదుతో పాటు 252 లిక్కర్ బాటిళ్లు లభ్యమైనట్లు సీబీడీటీ నివేదిక వెల్లడించింది. కొన్ని డైరీలతో పాటు కంప్యూటర్స్, ఫైల్స్ కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
మా ఫ్యామిలీ ప్రధానులు ఏమి చేయలేదు..! మోడీని మించిన PM లేరు : వరుణ్ గాంధీ
లెక్క లేని సొమ్ము..!
హవాలా రాకెట్ ద్వారా దాదాపు 281 కోట్ల రూపాయలు లీడర్లు, వివిధ సంస్థలు, పారిశ్రామికవేత్తల నుంచి సేకరించారనే పక్కా సమాచారంతో ఈ దాడులు చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే ఢిల్లీలో ఒక ప్రధాన పార్టీ కార్యాలయానికి 20 కోట్ల రూపాయలు వెళ్లినట్లు వారికి సమాచారమున్నట్లు తెలుస్తోంది.
సోమవారం నాటి దాడుల్లో 230 కోట్ల రూపాయలకు లెక్కలు రాయని క్యాష్ బుక్స్, 242 కోట్ల రూపాయల మేర బోగస్ బిల్లులు, ట్యాక్స్ కట్టని 80 డొల్ల కంపెనీలకు సంబంధించిన వివరాలు స్వాధీనం చేసుకున్నారు. లెక్కలేనన్ని ఆస్తులు, బినామీ ప్రాపర్టీలు ఢిల్లీలో ఉన్నట్లు గుర్తించామన్నారు. ఎన్నికల నేపథ్యంలో హవాలా సొమ్ముపై దృష్టి సారించిన ఐటీ అధికారులు.. భోపాల్, ఇండోర్, గోవా, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో 300 మంది సిబ్బందితో సోదాలు నిర్వహించారు.
హవాలా నేపథ్యం..!
సీఎం కమల్ నాథ్ సన్నిహితుడు, ఓఎస్డీ ప్రవీణ్ కక్కర్ ఇళ్లపై.. ఆదాయపు పన్ను శాఖ అధికారులు అకస్మాత్తుగా దాడులు చేయడం చర్చానీయాంశమైంది. ఆదివారం ఉదయం తెల్లవారుజామున మొదలైన ఈ ఆపరేషన్.. ఏకకాలంలో మొత్తం 52 చోట్ల సోదాలు నిర్వహించడం హాట్ టాపికయింది.
హవాలా లావాదేవీల ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరిపారు. కమల్ నాథ్ దగ్గరి బంధువు రతుల్ పురితో పాటు మరో సన్నిహితుడు రాజేంద్ర కుమార్ మిగ్లానీ తదితరుల ఇళ్లల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.