కన్న తల్లే కుమార్తెను దారుణంగా..: షాక్ తిన్న బంధువులు.. మధ్యప్రదేశ్లో అమానవీయం
భోపాల్: కన్నబిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లే ఆమె పట్ల కర్కషంగా వ్యవహరించింది. పాల కోసం మారాం చేస్తుందన్న కారణంతో ఏకంగా ఆ బిడ్డ గొంతు కోసి చంపేసింది. మధ్యప్రదేశ్ లోని ధార్లో గురువారం ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం.
బిడ్డ గొంతు కోసిన అనిత
నిందితురాలిని అనితగా పోలీసులు గుర్తించారు. బిడ్డ పాల కోసం పొద్దంతా ఏడుస్తూనే ఉండటంతో ఆమె తీవ్ర అసహనానికి గురైననట్టు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన అనిత.. ఒక పదునైన ఆయుధంతో ఆమె గొంతు కోసి హత్య చేసినట్టు వెల్లడించారు.
హత్యానంతరం బంధువుల ఇంటికి..
సంఘటన జరిగినప్పుడు ఇంట్లో అనిత, ఆమె కుమార్తె ఇద్దరే ఉన్నారని పోలీసులు తెలిపారు. చిన్నారిని హత్య చేసిన తర్వాత సమీపంలోని తన బంధువు ఇంటికెళ్లి అనిత తలుపు లాక్ చేసుకుందని చెప్పారు. కుమార్తెను విడిచిపెట్టి అనిత మాత్రమే రావడంతో ఆమె బంధువులకు సైతం అనుమానం కలిగి విషయంపై ఆరా తీసినట్టు తెలిపారు.
ఇలా వెలుగులోకి..
అనిత ప్రవర్తనపై అనుమానంతో ఆమె ఇంటివద్దకు వెళ్లిన బంధువులు.. ఇంటి తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అప్పటికే చిన్నారని రక్తపు మడుగులో పడి ఉండటం చూసి షాక్ తిన్నారు. ఆ వెంటనే అనిత భర్తకు సమాచారం అందించినట్టు తెలుస్తోంది.
పోస్ట్ మార్టమ్
చిన్నారి మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనపై స్పందించిన నిందితురాలి బంధువులు.. ఆమె ఇంత అఘాయిత్యానికి ఒడిగడుతుందనుకోలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పోలీసుల దర్యాప్తు తర్వాత ఆమెను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.