పంచముఖ హనుమాన్ ఆలయం మీద పాకిస్థాన్ జెండా: ఉద్రిక్తత, నిషేదాజ్ఞలు !
ప్రసిద్ది చెందిన పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం గోపురం మీద దుండగులు దాయాది పాకిస్థాన్ జాతీయ జెండాను పెట్టడంతో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసిన ఘటన మధ్యప్రదేశ్ లోని నరసింగ్ పుర్ జిల్లా కేంద్రంలో జరిగింది.
నరసింగ్ పూర్: ప్రసిద్ది చెందిన పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం గోపురం మీద దుండగులు దాయాది పాకిస్థాన్ జాతీయ జెండాను పెట్టడంతో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసిన ఘటన మధ్యప్రదేశ్ లోని నరసింగ్ పుర్ జిల్లా కేంద్రంలో జరిగింది.
నరసింగ్ పూర్ నగరంలో ప్రసిద్ది చెందిన పంచముఖ హనుమాన్ ఆలయం ఉంది. మధ్యప్రదేశ్ లోని అనేక ప్రాంతాల నుంచి నరసింగ్ పూర్ లోని ముంచముఖ హనుమాన్ ఆలయం చేరుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు.
శుక్రవారం అర్దరాత్రి దాటిన తరువాత గుర్తు తెలియని నిందితులు పంచముఖ హనుమాన్ ఆలయం గోపురం మీద పాకిస్థాన్ జాతీయ జెండా పెట్టారు. శనివారం ఉదయం ఆలయం సమీపంలో నివాసం ఉంటున్న వారు విషయం గుర్తించి వెంటనే ఆలయం నిర్వహక కమిటీ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
పంచముఖ హనుమాన్ ఆలయం కమిటీ సభ్యులు వెంటనే గోపురం మీద ఉన్న పాకిస్థాన్ జాతీయ జెండాను తొలగించారు. ఈ విషయం తెలుసున్న నరసింగ్ పూర్ నగర ప్రజలు పెద్ద ఎత్తున ఆలయం దగ్గరకు చేరుకోవడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. నరసింగ్ పూర్ నగర పోలీసులు ఆలయం దగ్గర గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండు రోజుల పాటు నరసింగ్ పూర్ నగరంలో నిషేదాజ్ఞలు విధించారు. పాకిస్థాన్ జెండా పెట్టిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.