దారుణం: చిన్న పిల్లలను ఎత్తుకెళ్లే వాడన్న అనుమానంతో రైతును కొట్టి చంపిన గ్రామస్తులు
మధ్యప్రదేశ్: మధ్య ప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. ఓ రైతుపై కొందరు సామూహిక దాడి చేయడంతో అతను మృతి చెందాడు. ఈ ఘటన ధార్ జిల్లాలోని మనావర్ తాలూకాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో పోలీసులు గ్రామ సర్పంచ్ బీజేపీనేతను అరెస్టు చేశారు. ఖిరాకియా గ్రామంకు ఈ రైతు తన ఐదుగురు స్నేహితులతో కలిసి వచ్చాడు. అయితే వారు అనుమానంగా కనిపించడంతో చిన్న పిల్లలను ఎత్తుకెళ్లే వారని భావించి 200 మంది గ్రామస్తులను సర్పంచి రెచ్చగొట్టాడు. దీంతో ఈ రైతుపై ఆ గ్రామస్తులు దాడి చేశారు. ఇతనితో పాటు వచ్చిన వారిపై కూడా దాడి చేయడంతో వారికి గాయాలయ్యాయి.
రైతుపై దాడి చేసిన గ్రామస్తులు..సర్పంచ్ అరెస్టు
అరెస్టు అయిన సర్పంచ్ పేరు రమేష్ జునపాని అని ధార్ జిల్లా ఎస్పీ చెప్పారు. ఇప్పటి వరకు ఐదు ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిని అరెస్టు చేసినట్లు చెప్పాడు. రైతుపై దాడి జరిగిన సమయంలో అక్కడ ఉన్న సీసీ టీవీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నట్లు ఎస్పీ చెప్పారు. ఇక ఈ ఘటనపై నిర్లక్ష్యం వహించిన ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేసినట్లు ఎస్పీ చెప్పారు. బుధవారం మధ్యాహ్నం రోజున 200 మంది ఆరుగురిపై సామూహిక దాడి చేసినట్లు ఎస్పీ వివరించారు. ఈ ఆరుగురు వ్యక్తులు ఉజ్జయిన్ గ్రామానికి చెందినవారని చెప్పారు. తమ పొలాల్లో పనిచేస్తామని చెప్పి తమ వద్ద డబ్బు తీసుకుని పని చేసేందుకు రాకపోవడంతో వారిని ప్రశ్నిద్దామని ఈ ఆరుగురు గ్రామానికి వెళ్లినట్లు ఎస్పీ వివరించారు.
చిన్నపిల్లలు ఎత్తుకెళ్లేవారని అనుమానం
ఇదిలా ఉంటే కొత్త గ్రామానికి వెళుతున్నందున ముందుగానే వారు ఖిరాకియా పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చి ఆ తర్వాతే గ్రామంలోకి అడుగుపెట్టినట్లు ఎస్పీ చెప్పారు. డబ్బులు తీసుకుని పనిచేసేందుకు రాకపోవడాన్ని ఈ ఆరుగురు ఆ కూలీలను ప్రశ్నించారు. వారు కూడా స్వరం పెంచడంతో వెంటనే గ్రామస్తులు గుమికూడారని ఎస్పీ చెప్పారు. ఇక పెద్ద సంఖ్యలో గ్రామస్తులు గుమికూడటంతో వారు తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే గ్రామస్తులు వారిపై రాళ్లతో దాడి చేశారు. చిన్న పిల్లలను ఎత్తుకెళ్లేందుకు వచ్చారని గట్టిగా కేకలు వేయడంతో మరికొందరు వారిపై దాడి చేశారని ఎస్పీ చెప్పారు. ఇక చుట్టుపక్కన ఉన్న గ్రామాల వారికి కూడా సమాచారం అందించడంతో ఆ ఆరుగురిని బొర్లాయ్ గ్రామం వద్ద చుట్టుముట్టి దాడి చేశారు.
దాడిని ఖండించి సీఎం కమల్నాథ్
ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గ్రామస్తులు బాధితులపై రాళ్ల దాడి, కర్రలతో దాడి చేయగా వారిలో గణేష్ ఖతి అనే రైతు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్ ఘటనను ఖండించారు. వెంటనే విచారణకు ఆదేశించారు. గాయపడ్డ బాధితులను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి తుల్సి సిలావత్ హాస్పిటల్లో పరామర్శించారు. ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని చెబుతూ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించినట్లు కమల్నాథ్ ట్వీట్ చేశారు. మరోవైపు మృతి చెందిన గణేష్ కుటుంబానికి రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు ఆరోగ్యశాఖ మంత్రి సిలావత్
బీజేపీ వ్యక్తిని శివరాజ్సింగ్ దాస్తున్నారన్న కాంగ్రెస్
రాష్ట్రంలో శాంతిభద్రతలు గాడి తప్పాయని మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ధ్వజమెత్తారు. రౌడీ రాజ్యంగా మధ్యప్రదేశ్ తయారైందని విమర్శించారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠినంగా శిక్షించాలని చెప్పారు. మరోవైపు బీజేపీ సర్పంచ్ ఈ ఘటనకు పాల్పడ్డారన్న విషయాన్ని శివరాజ్ సింగ్ చౌహాన్ దాస్తున్నారని కాంగ్రెస్ మీడియా సెల్ ఇంఛార్జ్ శోభా ఓజా ధ్వజమెత్తారు. అంతేకాదు శివరాజ్ సింగ్ చౌహాన్ సర్పంచ్తో దిగిన ఫోటోలను ఆమె ట్వీట్ చేశారు.