కేంద్రానికి మద్రాస్ హైకోర్టు ఆదేశం: రిజర్వేషన్ చట్టంపై లిఖితపూర్వక వివరణ ఇవ్వండి
ఆర్థికంగా వెనకబడిన అగ్రకులాల వారికి 10శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్రం తీసుకొచ్చిన చట్టంపై మద్రాస్ హైకోర్టులో డీఎంకే ఎంపీ ఆర్ఎస్ భారతి పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై వివరణ ఫిబ్రవరి 18లోగా ఇవ్వాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మద్రాసు హైకోర్టు ఆదేశించింది.
లిఖిత పూర్వక వివరణ ఇవ్వండి
ఆర్థికంగా వెనకబడిన అగ్రకులాల వారికి 10శాతం రిజర్వేషన్లు అమలు చేయడం సరికాదంటూ దీన్ని సవాలు చేస్తూ డీఎంకే ఎంపీ ఆర్ఎస్ భారతి మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను జస్టిస్ మణికుమార్, సుబ్రమణ్య ప్రసాద్లతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేసింది. తదుపరి విచారణ సమయానికల్లా కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ బిల్లుపై పూర్తి సమాచారంను లిఖితపూర్వకంగా సమర్పించాలని అడిషనల్ సొలిసిటర్ జనరల్ జి. రాజగోపాల్కు సూచించింది. ప్రాథమిక వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ఎంపీ భారతి పిటిషన్ దాఖలు చేయడం జరిగిందని అడిషనల్ సోలిసిటర్ జనరల్ రాజగోపాల్ వాదించారు. పార్లమెంటు బిల్లును పాస్ చేసే సమయంలో డీఎంకే కూడా సభలో ఉందని ఆయన గుర్తుచేశారు.
ఈవీఎం అక్రమాలపై విపక్షాల నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు
ఇరు వర్గాల న్యాయవాదుల మధ్య తారాస్థాయికి చేరిన వాదనలు
అడిషనల్ సొలిసిటర్ జనరల్, పిటిషనర్ తరపున న్యాయవాదుల మధ్య వాదనలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో జడ్జీలు జోక్యం చేసుకున్నారు. కేంద్రం కౌంటర్ అఫడవిట్ దాఖలు చేయాల్సిందిగా ఏఎస్జీ రాజగోపాల్కు సూచించారు. ఆర్థిక పరిస్థితి ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వొచ్చనే ప్రతిపాదన రాజ్యాంగంలో ఎక్కడైనా రాసి ఉందా అని జస్టిస్ సుబ్రహ్మణ్య ప్రసాద్ ప్రశ్నించారు. కుల వివక్ష దేశాన్ని కొన్ని శతాబ్దాలుగా పట్టి పీడిస్తున్న అంశమని భారతి తన పిటిషన్లో పేర్కొన్నారు. జాతి, వర్ణల ఆధారంగా కులాలు విభజించబడ్డాయని చెప్పిన భారతి ఇదంతా వేదాల నుంచి వచ్చినదే అని చెప్పారు. ముఖ్యంగా రుగ్వేదంలో మనుషులను తాము చేసే పనుల ఆధారంగా విభజించడం జరిగిందని తెలిపారు.
మనుషులను విభజించింది వేదాలే
పూజారులు గురువులను బ్రాహ్మణుల కింద, యుద్ధవీరులు, పరిపాలకులను క్షత్రియులుగా, రైతులు వ్యాపారవేత్తలను వైశ్యులుగా కూలీలుగా శూద్రులను వేదాలు విభజించాయని చెప్పారు భారతి. ఇక్కడి నుంచే కుల వివక్ష ప్రారంభమైందని భారతి వెల్లడించారు. ఇది సామాజికంగా కూడా మనిషిపై తీవ్ర ప్రభావం చూపాయని పిటిషన్లో వివరించారు. ఒకవేళ తక్కువ కులానికి చెందిన వ్యక్తి ధనవంతుడైనప్పటికీ.. అగ్రకులాల వ్యక్తులతో స్నేహం చేసేందుకు సరితూగడనే భావన నెలకొందని.. ఈక్రమంలోనే అంటరానివారిగా వారిపై ముద్ర వేయడం జరిగిందని భారతి చెప్పారు.
కేంద్రం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడింది
ఇక భారతదేశానికి స్వాతంత్ర్యం లభించాకే రాజ్యాంగం అంటరానితనం అనే కాన్సెప్ట్ను కొట్టివేసిందని చెప్పిన భారతి ఈ క్రమంలోనే సామాజికంగా వెనకబడిన వర్గాల వారికి విద్యాఉద్యోగావకాశాల్లో రిజర్వేషన్లు కల్పించడం జరిగిందన్నారు. సామాజికంగానే రిజర్వేషన్లు ఇవ్వాలని రాజ్యాంగం సూచించింది తప్ప అగ్రకులాల్లో ఆర్థికంగా వెనకబడిన వారికి రిజర్వేషన్లు ఇవ్వాలని ఎక్కడా చెప్పలేదని భారతి వెల్లడించారు. అయితే కేంద్రం రాజ్యాంగ సవరణ చేసి చట్టం తీసుకురావడం అంటే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్లే అని భారతి తెలిపారు. బిల్లుకు సంబంధించిన కాపీలు సభ్యులకు ముందస్తుగా అందజేయకుండానే హడావుడిగా పార్లమెంటులో పాస్ చేశారని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు.