మరికాసేపట్లో డీఎంకే పిటిషన్ విచారణ చేయనున్న మద్రాస్ హైకోర్టు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కలైజ్ఞర్ కరుణానిధి అంత్యక్రియలపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. మెరీనా బీచ్లోని కరుణా రాజకీయ గురువు అన్నాదురై సమాధి వెనకాలే తలైవాకు స్థలం కేటాయించాలని డీఎంకే కోరింది. అయితే ఇందుకు నిబంధనలు ఒప్పుకోవని ప్రభుత్వం తేల్చడంతో డీఎంకే పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. మంగళవారం రాత్రి మద్రాస్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నివాసంలో వాదనలు జరిగాయి. అయితే కోర్టు బుధవారం ఉదయానికి పిటిషన్ విచారణ వాయిదా వేసింది.
అయితే కరుణానిధి సమాధికి స్థలం మెరీనా బీచ్లో కేటాయించాలనే దానికి పలువురు ప్రముఖుల నుంచి మద్దతు లభిస్తోంది. దేశం ఇలాంటి మహానేత మరణాన్ని తట్టుకోలేకపోతోందని అలాంటి సమయంలో రాజకీయాలు అనవసరమని ... తమిళ గొంతుక ప్రపంచవ్యాప్తంగా వినిపించిన తలైవాకు మెరీనాలో చోటు కల్పించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. మరోవైపు కరుణానిధి సమాధికి అన్నాదురై మెమోరియల్ దగ్గర స్థలం కేటాయించేలా రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టాలని అదే ఆ మహానేతకు మనమిచ్చే ఘనమైన గౌరవమని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అభిప్రాయపడ్డారు.
Recommended Video
ఇదిలా ఉంటే కరుణానిధి పార్థీవదేహాన్ని ప్రజల సందర్శనార్థం కోసం ప్రఖ్యాత రాజాజీ హాల్లో ఉంచారు. సీఎం పళని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంలు కరుణానిధికి నివాళులు అర్పించారు. కరుణానిధి అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించాలనేదానిపై మరి కాసేపట్లో క్లారిటీ వస్తే ఇక పనులు వేగవంతం అయ్యే అవకాశం ఉంది.కరుణానిధి కంటే తమకు ఏదీ ముఖ్యం కాదని, కాబట్టి మెరీనా బీచ్లో అంత్యక్రియలపై వేసిన పిటిషన్ను వెనక్కి తీసుకుంటున్నట్టు న్యాయవాది దొరైస్వామి తెలిపారు. తాము పిటిషన్ ఉపసంహరించుకుంటే ప్రభుత్వానికి న్యాయపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవని, కాబట్టి కరుణ అంత్యక్రియలు మెరీనా బీచ్లోనే నిర్వహించవచ్చని అన్నారు.