క్వారీ కింగ్ శేఖర్ రెడ్డికి రూ. 33 కోట్ల రూ. 2,000 నోట్లు ఎలా వచ్చాయి: సీబీఐని ప్రశ్నించిన హైకోర్టు!
చెన్నై: ఇసుక క్వారీల కాంట్రాక్టర్, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డి అక్రమ నగదు లావాదేవీలపై మీరు ఎలాంటి విచారణ చేశారు ? ఆ వివరాలు ఏమిటీ, బ్యాంకు అధికారులను ప్రశ్నించారా ? లేదా ? అనే పూర్తి సమాచారం ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు సీబీఐని ఆదేశించింది.
సోమవారం మద్రాస్ హైకోర్టులో శేఖర్ రెడ్డి అక్రమ నగదు లావాదేవీల వ్యవహారం కేసు విచారణ జరిగింది. పెద్ద నోట్లు రద్దు అయిన నెల తరువాత సీబీఐ అధికారులు శేఖర్ రెడ్డి ఇంటిలో సోదాలు చేసి రూ. 33 కోట్ల విలువైన రూ. 2,000 నోట్లు స్వాధీనం చేసుకున్నారు.
పెద్ద నోట్లు రద్దు అయిన తరువాత శేఖర్ రెడ్డి చేతికి రూ. 33 కోట్ల రూ. 2,000 నోట్లు ఎలా వచ్చాయి అని మీరు దర్యాప్తు చేశారా అంటూ మద్రాస్ హైకోర్టు సీబీఐని ప్రశ్నించింది. శేఖర్ రెడ్డి చేతికి రూ. 33 కోట్ల విలువైన రూ. 2,000 నోట్లు ఇచ్చిన బ్యాంకులు ఏవి, ఆ అధికారులు ఎవరు అని మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది.
శేఖర్ రెడ్డి చేతికి అక్రమంగా నగదు రావడానికి కారణం అయిన బ్యాంకు అధికారులు ఎవరు అనే పూర్తి సమాచారం అక్టోబర్ 25వ తేదీలోపు ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు సూచించింది. ఈడీ అధికారులు సైతం శేఖర్ రెడ్డికి చెందిన రూ. 34 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను జప్తు చేసింది.