దళితులకు వేరే స్మశానవాటికనా.. రాష్ట్ర సర్కార్పై హైకోర్టు సీరియస్
చెన్నై: దళితుల మృతదేహాలు ఖననం చేసేందుకు ప్రత్యేక స్మశానం కేటాయించడాన్ని తప్పుబడుతూ తమిళనాడు సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది మద్రాస్ హైకోర్టు. కొద్ది రోజుల క్రితం దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మృతి చెందగా... మృతదేహాన్ని తమ పొలాల మధ్య నుంచి తీసుకెళ్లరాదని అగ్రకులాల వారు సూచించడంతో ఓ నదిలోకి మృతదేహాన్ని దించి ఆపై స్మశానవాటికకు చేర్చిన నేపథ్యంలో హైకోర్టు సీరియస్గా తీసుకుంది.
ఆగష్టు 17న వేలూరులోని నారాయణపురం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆగష్టు 21న ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన జస్టిస్ ఎస్ మణికుమార్, జస్టిస్ సుబ్రహ్మణ్యం ప్రసాద్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేసింది. ఈ ఘటనపై నివేదిక సమర్పించాల్సిందిగా వేలూరు జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. అయితే నివేదిక సమర్పించిన అధికారులు... నారాయణపురం గ్రామంలో దళితులకు వేరే స్మశానవాటికను ఏర్పాటు చేశామని తెలిపారు. అధికారులు పొందుపర్చిన సమాచారంపై మద్రాస్ హైకోర్టు సీరియస్గా రియాక్ట్ అయ్యింది. అసలు దళితులకు మరో స్మశానవాటికను ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నించింది.
దళితులకు మరో స్మశానవాటికను ఏర్పాటు చేశారంటే ఇది కచ్చితంగా కులవివక్షగానే పరిగణించాల్సి వస్తుందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకా కులవివక్షను ప్రోత్సహిస్తున్నారా అని ప్రశ్నించింది. ప్రభుత్వమే కులాల మధ్య విబేధాలు సృష్టిస్తోందనే సీరియస్ కామెంట్స్ హైకోర్టు చేసింది. ఈ ఘటనే అందుకు నిదర్శనమని పేర్కొంది.
వీధులకు కులంతో ముడిపడి ఉన్న పేర్లను తొలగించాలని ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేసిన ధర్మాసనం... స్కూళ్లల్లో మాత్రం ఎందుకు తొలగించలేదని ప్రశ్నించింది. దళితుల మృతదేహాలు ఖననం చేసేందుకు ప్రత్యేకంగా భూమిని కేటాయించడంపై పూర్తి వివరాలతో కూడిన నివేదిక సమర్పించాలని వేలూరు జిల్లా కలెక్టర్కు, వనియంబాడి తహసీల్దారుకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు జరిగిన ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని కూడా ప్రశ్నించిన కోర్టు కేసు విచారణను ఆగష్టు 28కి వాయిదా వేసింది.