అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేకు హైకోర్టు వార్నింగ్: రూ. లక్ష ఫైన్, తమాషానా, శశికళకు !
తమిళనాడు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలలో చీలిక తీసుకు వచ్చి నానా హంగామా చేస్తున్న టీటీవీ దినకరన్ వర్గానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది.
చెన్నై: తమిళనాడు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలలో చీలిక తీసుకు వచ్చి నానా హంగామా చేస్తున్న టీటీవీ దినకరన్ వర్గానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అన్నాడీఎంకే పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించడానికి వీల్లేదని, స్టే ఇవ్వాలని మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వెయ్యడంతో న్యాయమూర్తి చివాట్లు పెట్టారు.
పనిపాట లేకుండా ప్రతి చిన్న విషయానికి కోర్టుకు వస్తే పరిస్థితులు వేరుగా ఉంటాయని మద్రాసు హైకోర్టు టీటీవీ దినకరన్ వర్గాన్నిహెచ్చరించింది. టీటీవీ దినకరన్ వర్గంలోని ఎమ్మెల్యే పీ. వెట్రివేల్ కు అక్షింతలు వేసిన మద్రాసు హైకోర్టు రూ. ఒక లక్ష ఫైన్ కట్టాలని ఆదేశాలు జారీ చేసింది.
శశికళకు గేట్ పాస్
సెప్టెంబర్ 12వ తేదీ చెన్నైలోని రాయపేట్ లోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించి శశికళ, టీటీవీ దినకరన్ తో పాటు వారి కుటుంబ సభ్యులను శాశ్వతంగా పార్టీ నుంచి బహిష్కరించడానికి చకచకా పనులు జరుగుతున్నాయి.
దినకరన్ ప్లాన్ తో హైకోర్టుకు
మంగళవారం అన్నాడీఎంకే పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించకుండా ఆదేశాలు ఇవ్వాలని దినకరన్ వర్గంలోని ఎమ్మెల్యే వెట్రివేల్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించాడు. సోమవారం వెట్రివేల్ పిటిషన్ ను మద్రాసు హైకోర్టు విచారణకు స్వీకరించింది.
మంత్రి జయకుమార్ కౌంటర్
అన్నాడీఎంకే పార్టీ నియమాల ప్రకారం ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అధ్యక్షతన సర్వసభ సమావేశం నిర్వహిస్తున్నామని తమిళనాడు మంత్రి జయకుమార్ మద్రాసు హైకోర్టులో వివరణ ఇస్తూ కౌంటర్ దాఖలు చేశారు.
పార్టీ వ్యవహారాలు కోర్టుకు తెస్తారా !
ఇరు వర్గాల వాదన విన్న మద్రాసు హైకోర్టు ఎమ్మెల్యే వెట్రివేల్ ను తీవ్రస్థాయిలో మందలించింది. అన్నాడీఎంకే పార్టీ అంతర్గత వ్యవహారాలను కోర్టుకు తీసుకువచ్చి సమయం వృదా చేస్తున్నారని తీవ్రస్థాయిలో హెచ్చరించింది. మీకు పనిపాట లేదా అని మద్రాసు హైకోర్టు వెట్రివేల్ న్యాయవాదిని ప్రశ్నించింది.
రూ. లక్ష ఫైన్ వేసిన హైకోర్టు
పార్టీలో అసమ్మతి ఉంటే మీరు మీరు పరిష్కరించుకోవాలని, కోర్టు వరకురాకూడదని మద్రాసు హై కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. కోర్టు సమయాన్ని వృదా చేసినందుకు ఒక లక్ష రూపాయాలు అపరాద రుసుం చెల్లించాలని వెట్రివేల్ న్యాయవాదిని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. శశికళ, టీటీవీ దినకరన్ ను పార్టీ నుంచి బహిష్కరించకుండా చూడాలని ప్రయత్నించిన ఎమ్మెల్యే వెట్రివేల్ న్యాయవాదికి మద్రాసు హైకోర్టు అక్షింతలు వెయ్యడంతో టీటీవీ దినకర్ వర్గీయులు అయోమయంలో పడిపోయారు.