చిన్నారిపై రేప్: రాక్షసుడికి 10 ఏళ్లు జైలు శిక్ష
చెన్నయ్: అణ్యంపుణ్యం తెలియని పసిబిడ్డ మీద అత్యాచారం చేసిన కామాంధుడి మీద కనికరం చూపించరాదని, అలాంటి వారిని దేవుడు కూడ క్షమించడని మద్రాసు హై కోర్టు చెప్పింది. కామాంధులకు కఠిన శిక్ష విధించడమే సరైన తీర్పు అని స్పష్టం చేసింది.
కింది కోర్టు విధించిన తీర్పును తాము ఖరారు చేస్తున్నామని మద్రాసు హై కోర్టు న్యాయమూర్తి డి. దేవదాస్ చెప్పారు. తమిళనాడులోని ఈరోడ్ జిల్లాకు చెందిన సెంథిల్ కుమార్ (25) అనే వ్యక్తి నాలుగు సంవత్సరాల బాలిక మీద అత్యాచారం చేశాడు.
కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. కేసు విచారణ చేసిన సెషన్స్ కోర్టు 2010లో నిందితుడు సెంథిల్ కుమార్ కు 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ. వెయ్యి రూపాయల జరిమాన విధించింది. నిందితుడు శిక్ష తగ్గించాలని మద్రాస్ హై కోర్టును ఆశ్రయించాడు.
కేసు విచారణ చేసిన న్యాయమూర్తి దేవదాస్ పశువులాగ ప్రవర్థించిన నీలాంటి వ్యక్తికి శిక్ష తగ్గించనవసరం లేదని అన్నారు. నీలాంటి వారి మీద సానుభూతి చూపిస్తే మానవత్వం మంటకలిసిపోతుందని చెప్పారు. నాలుగు సంవత్సరాల పాప నీమీద కక్ష కట్టి కేసు పెడుతుందా అని ప్రశ్నించారు.
నీకు కింది కోర్టు విదించిన శిక్షనే ఖరారు చేస్తున్నామని న్యాయమూర్తి దేవదాస్ తీర్పు చెప్పారు. అయితే ఇదే న్యాయమూర్తి నాలుగు రోజుల క్రితం ఒక రేప్ కేసులో ఇద్దరికి రాజీ చేసి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలని తీర్పు చెప్పారు.