రజినీకాంత్పై కేసు: పిటీషనర్కు మద్రాస్ హైకోర్టు హితబోధ
చెన్నై: దక్షిణాది సూపర్స్టార్ రజినీకాంత్పై దాఖలైన పిటీషన్ను మద్రాస్ హైకోర్టు కొట్టేసింది. ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్ రామస్వామిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ పిటీషన్ దాఖలైంది. ద్రవిడర్ విడుదలై కజగం (డీవీకే) ఈ పిటీషన్ను దాఖలు చేసింది. డీవీకే తరఫున ఆ పార్టీ కార్యదర్శి ఉమాపతి దీన్ని దాఖలు చేశారు. దీనిపై మద్రాస్ హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది.
ఈ పిటీషన్పై విచారణకు స్వీకరించిన అనంతరం.. న్యాయమూర్తులు పిటీషనర్కు హితబోధ చేసింది. నేరుగా హైకోర్టులో ఈ పిటీషన్ను దాఖలు చేయడానికి గల కారణాలేమిటని ప్రశ్నించింది. తొలుత- మేజిస్ట్రేట్ న్యాయస్థానానికి వెళ్లకుండా నేరుగా హైకోర్టులో ఈ పీటీషన్ను వేయడం పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. మేజిస్ట్రేట్ న్యాయస్థానానికి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించింది. దీనిపై ఉమాపతి తరఫు న్యాయవాది బదులిస్తూ.. రజినీకాంత్ చేసిన వ్యాఖ్యల తీవ్రత ఆధారంగా తాము నేరుగా హైకోర్టులో పిటీషన్ వేయాల్సి వచ్చిందని అన్నారు. ఆయన వాదనలతో హైకోర్టు న్యాయమూర్తులు ఏకీభవించలేదు. దీన్ని కొట్టేశారు.
ఈ నెల 14వ తేదీన సేలంలో ఏర్పాటైన ఓ కార్యక్రమం సందర్భంగా రజినీకాంత్.. పెరియార్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై కేసు నమోదైంది. చో రామస్వామి ఏర్పాటు చేసిన తుగ్లక్ పత్రిక 50వ వార్షికోత్సవ కార్యక్రమంలో రజినీకాంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. చరిత్రను వక్రీకరించేలా, పెరియార్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా రజినీ వ్యాఖ్యలు చేశారంటూ ద్రవిడర్ విడుదలై కజగం అధ్యక్షుడు మణి, కార్యదర్శి ఉమాపతి ఇదివరకు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
తమిళ ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా రజినీకాంత్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ డీవీకే ఈ నెల 18వ తేదీన పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అనంతరం ఆయన ఇంటిపై దాడులు చేయడానికి అవకాశం ఉందంటూ వార్తలు వెలువడ్డాయి. దీనితో చెన్నైలోని రజినీకాంత్ నివాసానికి పోలీసులు భారీ భద్రతను సైతం కల్పించారు. తాజాగా ఈ మద్రాస్ హైకోర్టు ఈ పిటీషన్ను కొట్టేసింది. డీవీకే మేజిస్ట్రేట్ న్యాయస్థానంలో మరోసారి ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.