జయకు 'భారతరత్న'పై హైకోర్టు షాక్: జోక్యం కోరవద్దని హితవు..
తమిళ దివంగత సీఎం జయలలితకు భారతరత్న పురస్కారం ఇవ్వాల్సిందిగా చొరవ చూపాలని హైకోర్టును కోరడం పట్ల న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది.
చెన్నై: పురస్కారాల విషయాల్లో కోర్టుల జోక్యం కోరడం పట్ల మద్రాస్ హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తమిళ దివంగత సీఎం జయలలితకు భారత అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని.. కేంద్ర ప్రభుత్వానికి సూచించాలంటూ మద్రాస్ హైకోర్టు ప్రమేయాన్ని కోరడం పట్ల కోర్టు ఈవిధంగా స్పందించింది.
ఇలాంటి విషయాల్లో కోర్టు జోక్యం చేసుకోబోదని మద్రాస్ హైకోర్టు తేల్చి చెప్పింది. దీనిపై దాఖలైన పిల్ ను న్యాయస్థానం కొట్టివేసింది. జయలలితకు భారతరత్న పురస్కారం కోసం హైకోర్టు సిఫారసు చేయాల్సిందిగా తమిళనాడుకు చెందిన ఓ ట్రస్టు నిర్వాహకుడు కేకే రమేష్ ఈ పిల్ దాఖలు చేశారు.
చీఫ్ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎం.సుందర్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను తోసిపుచ్చింది. కాగా, పిల్ విచారణ సందర్బంగా.. జయలలిత జీవిత చరిత్ర, ఆమె సినీ-రాజకీయ ప్రయాణంలోని విజయాలు, అవార్డుల గూర్చి పిటిషనర్ తరుపు న్యాయవాది న్యాయమూర్తికి విన్నవించారు.
సీఎంగా జయలలిత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి కూడా న్యాయమూర్తి ఎదుట ప్రస్తావించారు. ముఖ్యంగా 'అమ్మ క్యాంటీన్' ద్వారా అతి తక్కువ ధరకు భోజనం అందించడం, విద్యార్థులకు ల్యాప్టాప్లు, సైకిళ్లు పంపిణీ చేయడం వంటి సంక్షేమ పథకాల గురించి పిటిషనర్ వివరించారు.
తమిళ ప్రజల ప్రయోజనాల కోసం జయలలిత చాలా కృషి చేశారని, అందుకే తమిళులంతా ఆమెను 'అమ్మ'గా భావిస్తారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న తర్వాత పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది. ఇలాంటి విషయాల్లో కోర్టు జోక్యాన్ని కోరవద్దని స్పష్టం చేసింది.
కాగా, అంతకుముందు డిసెంబర్ 19న ప్రధాని మోడీని కలిసిన తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం జయలలితకు భారతరత్న ప్రకటించాల్సిందిగా విన్నవించిన సంగతి తెలిసిందే.