నీట్ పరీక్ష స్కామ్: కేంద్రానికి మద్రాస్ హైకోర్టు నోటీసులు
చెన్నై: నీట్ స్కామ్ ఒక్క తమిళనాడు ప్రభుత్వందే తప్పిదం అని చెప్పేందుకు లేదని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. దీన్ని సుమోటోగా స్వీకరించిన మద్రాస్ హైకోర్టు కేంద్ర ఆరోగ్యశాఖ, మానవవనరుల అభివృద్ధి శాఖలను ప్రతివాదులుగా చేరుస్తూ నోటీసులు జారీ చేసింది. ఈ స్కామ్ ప్రభావం దేశవ్యాప్తంగా పడినందున కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సమాధానం కోరింది మద్రాస్ హైకోర్టు.
నీట్ పరీక్ష 2019: కటాఫ్ మార్కులు ఇవే...ఈ ప్రశ్నలు చాలా కష్టంగా వచ్చాయి
ఇప్పటి వరకు ఈ స్కామ్లో ఐదుగురు విద్యార్థులు వారి తల్లిదండ్రులపై ఆరోపణలు వచ్చాయి. మెడికల్ కాలేజీలో అడ్మిషన్ పొందేందుకు వీరు తప్పుడు మార్గాలు వెతికినట్లు సమాచారం. నీట్ పరీక్ష రాయాల్సిన అసలు విద్యార్థుల బదులు ఇతరులు పరీక్ష రాసినట్లు వెలుగులోకి వచ్చింది. గత నెలలో ఈ స్కామ్ బయటపడింది. తేనీ ప్రభుత్వ మెడికల్ కాలేజీ డీన్ ఏకే రాజేంద్రన్కు సెప్టెంబర్ 11న మరియు సెప్టెంబర్ 13న రెండు ఈమెయిల్స్ వచ్చాయి. కేవీ ఉదిత్ సూర్య అనే విద్యార్థి కోసం మరొక విద్యార్థి పరీక్ష రాసినట్లు లేఖలో ఉంది. దీంతో కాలేజీ అధికారులు విచారణకు ఆదేశించారు. అనంతరం సెప్టెంబర్ 28న కేసును సీబీసీఐడీకి బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.
ఉదిత్తో పాటు చెన్నైలోని ప్రభుత్వ స్టాన్లీ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న అతని తండ్రి వెంకటేశన్ను సీబీసీఐడీ అరెస్టు చేసింది. మరో నలుగురు ఎంబీబీఎస్ విద్యార్థులు వారి తండ్రులు కూడా అరెస్టు చేయడం జరిగింది. ఈ ఎపిసోడ్ వెనక అసలు నిజం ఏమిటో బయటకు చెప్పాలని , ఇందుకోసం సీబీఐతో విచారణ చేయిస్తేనే అసలు నిజాలు బయటకు వస్తాయని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ డిమాండ్ చేశారు.