సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ కు మద్రాసు హైకోర్టు నోటీసులు..కారణం ఇదే !!
ఆస్కార్ అవార్డు గ్రహీత, సంగీత దిగ్గజమైన ఏఆర్ రెహమాన్ కి మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆదాయపన్ను శాఖకు పన్ను ఎగవేత కేసులో ఆయనకు నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది. ఆదాయపుపన్ను శాఖ దాఖలు చేసిన కేసుకు సంబంధించి వివరణ కోరుతూ మద్రాస్ హైకోర్టు నోటీస్ ఇచ్చింది.
ఇంగ్లాండ్ లో ఓ కంపెనీ నుంచి ఏ ఆర్ రెహమాన్ ఫౌండేషన్ కు రూ.3.47 కోట్ల బదిలీ
ఏ ఆర్ రెహమాన్ ఫౌండేషన్ .. రెహమాన్ కు సంబంధించిన ఛారిటబుల్ ట్రస్టు ద్వారా ఆయన మూడు కోట్లకు పైగా ఆదాయాన్ని పన్ను ఎగవేత ద్వారా సంపాదించారని ఆరోపణల నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ కేసు నమోదు చేసింది. ఇంగ్లాండ్ కు చెందిన ప్రముఖ కంపెనీ నుంచి ఏ ఆర్ రెహమాన్ ఫౌండేషన్ కు తీసుకున్న 3.47 కోట్లకు సంబంధించి రెహమాన్ ఆదాయపన్ను చెల్లించలేదని ఐటీ శాఖ ఆరోపిస్తోంది.ఈ క్రమంలోనే ఐటీ శాఖ ఆరోపణలకు బదులు ఇవ్వాలంటూ మద్రాస్ న్యాయస్థానం నోటీసులో పేర్కొంది.
రింగ్ టోన్స్ కంపోజ్ చెయ్యటానికి ఒప్పందం .. నగదు ట్రస్ట్ ఖాతాలో
యూకే కి చెందిన ఒక టెలికాం సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న ఏ ఆర్ రెహమాన్, ఆ సంస్థకు ప్రత్యేకమైన రింగ్ టోన్ లను కంపోజ్ చేయడానికి 2011-12 వ సంవత్సరంలో 3.47 కోట్ల ఆదాయాన్ని పొందారని ఆదాయపు పన్ను శాఖ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. ఒప్పందం ప్రకారం ఆయన తన వేతనాన్ని తనచే నిర్వహించబడుతున్న ఏఆర్ రెహమాన్ చారిటబుల్ ఫౌండేషన్ కు నేరుగా చెల్లించాలని కంపెనీకి సూచించారని ఐటీ విభాగం చెబుతోంది.
ట్రస్ట్ నగదుకు ఆదాయపు పన్ను మినహాయింపు .. రెహమాన్ పన్ను ఎగవేశారని ఐటీ ఆరోపణ
అయితే పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని రెహమాన్ నేరుగా స్వీకరించి, పన్ను చెల్లింపు తర్వాత ట్రస్టుకు బదిలీ చెయ్యాల్సి ఉంటుంది. కానీ పన్ను చెల్లించకుండా ఉండేందుకు నేరుగా రెహమాన్ చారిటబుల్ ట్రస్ట్ కు ఆదాయాన్ని బదిలీ చేయాలని చెప్పి పన్ను ఎగరవేశారు అంటూ న్యాయవాది పేర్కొన్నారు . చారిటబుల్ ట్రస్ట్ లకు వచ్చే ఆదాయాన్ని ఆదాయ పన్ను చట్టం కింద మినహాయింపు ఇస్తున్న కారణంగా రెహమాన్ ఈ పని చేసినట్లుగా ఆదాయ పన్ను శాఖ ఆరోపిస్తోంది.
Recommended Video
మద్రాసు కోర్టు నోటీసు పై ఏ ఆర్ రెహమాన్ ఏం సమాధానం ఇస్తారో
ఏ ఆర్ రెహమాన్ పౌండేషన్ , ఒక చారిటబుల్ ట్రస్ట్ .. సంగీతం, విద్యతో పాటుగా నిరుపేదలకు మానసిక , శారీరకంగా మెరుగైన జీవితానికి ఇది ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తుందని, ఫౌండేషన్ ద్వారా సహకారం అందిస్తుందని తెలుస్తుంది. ఇక మద్రాసు కోర్టు నోటీసు పై ఏ ఆర్ రెహమాన్ ఏం సమాధానం ఇస్తారో తెలియాల్సి ఉంది .