చిక్కుల్లో హీరో సూర్య: న్యాయూమూర్తులపై కామెంట్స్: కోర్టు ధిక్కార కేసుగా: మద్రాస్ హైకోర్టులో
చెన్నై: ప్రముఖ తమిళ నటుడు సూర్య ఇబ్బందుల్లో పడ్డారు. న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకున్నారు. న్యాయమూర్తులు, న్యాయస్థానాలపై ఆయన వ్యాఖ్యలు చేయడం ఈ వివాదాలకు కారణమైంది. సూర్యపై కోర్టు ధిక్కార ప్రొసీడింగ్స్ తీసుకోవాలంటూ మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఎం సుబ్రమణియమ్ సిఫారసు చేశారు. ఈ మేరకు ఆయన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏపీ సాహికి లేఖ రాశారు. సూర్య చేసిన వ్యాఖ్యలు కోర్టు ధిక్కార పరిధిలోకి వస్తాయని పేర్కొన్నారు. దీనిపై మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎలా స్పందిస్తారనేది ఇంకా తేలాల్సి ఉంది.
Recommended Video
జపాన్ కొత్త ప్రధాని ఎవరంటే?: పేద రైతు కుటుంబం నుంచి ప్రధానిగా: అట్టపెట్టెల కంపెనీలో లేబర్గా
నేషనల్ ఎలిజిబిలిటి ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పరీక్షల నిర్వహణ విషయంలో సూర్య ఈ కామెంట్స్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. దాన్ని తన అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో నీట్ పరీక్షలను నిర్వహించడం ఏ మాత్రం సమర్థనీయం కాదని ఆయన పేర్కొన్నారు. ప్రాణభయంతో ఒకవంక న్యాయమూర్తులే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపడుతున్నారని, తీర్పులు ఇస్తున్నారని అన్నారు.
అలాంటి పరిస్థితుల మధ్య విద్యార్థులు ప్రాణభయం లేకుండా ధైర్యంగా పరీక్షలకు హాజరవుతున్నారని పేర్కొంటూ తన ప్రకటనలో పేర్కొన్నారు. సూర్య చేసిన ఈ వ్యాఖ్యలు ఆయనకు న్యాయపరమైన ఇబ్బందులను తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. న్యాయస్థానం ప్రొసీడింగ్స్ మీద వ్యాఖ్యలు చేసినందు వల్ల వాటిని కోర్టు ధిక్కారంగా పరిగణించాలంటూ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎం సుబ్రమణియం మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు.
భారతీయ న్యాయవ్యవస్థను తప్పుపట్టేలా సూర్య వ్యాఖ్యలు ఉన్నాయని పేర్కొన్నారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి ఎలా స్పందిస్తారనేది ఇంకా తెలియరావాల్సి ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం నీట్ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆదివారం నీట్ పరీక్షలను నిర్వహించింది. కరోనా పరిస్థితుల మధ్య ఈ పరీక్షలను రాయాల్సి వచ్చినందు వల్ల తీవ్ర ఒత్తిడికి గురైన ముగ్గురు తమిళ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.
My heart goes out to the three families..! Can't imagine their pain..!! pic.twitter.com/weLEuMwdWL
— Suriya Sivakumar (@Suriya_offl) September 13, 2020
మృతుల కుటుంబాలకు మద్దతుగా, నీట్ విద్యార్థులకు మానసిక స్థైర్యాన్ని కల్పించడానికి సూర్య ఈ ప్రకటన విడుదల చేశారని చెబుతున్నారు. విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం, అదే సమయంలో సూర్యపై కోర్టు ధిక్కారణ కేసు నమోదు చేసే అవకాశం ఉండటం తమిళనాడు సంచలనం సృష్టిస్తోంది. నీట్ పరీక్షల నిర్వహణపై ఇప్పటికే ప్రతిపక్ష డీఎంకే పార్టీ చీఫ్ ఎం కే స్టాలిన్.. తన నిరసనను వ్యక్తం చేశారు. పార్లమెంట్లో కూడా ఆ పార్టీ సభ్యులు కణిమోళి, టీఆర్ బాలు ఈ అంశాన్ని ప్రస్తావించారు. తాజాగా- సూర్య వ్యవహారం తెరమీదికి రావడంతో మరింత వేడిక్కాయి అక్కడి రాజకీయాలు. #TNStandWithSuriya అనే హ్యాష్ట్యాగ్ను ట్రెండ్ చేస్తున్నారు ఆయన అభిమానులు.