మారన్ సోదరులకు హైకోర్టులో ఎదురు దెబ్బ
చెన్నై: మారన్ సోదరులకు మద్రాస్ హై కోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. వారు సమర్పించిన పిటీషన్ను కోర్టు కొట్టి వేసింది. ఈ దెబ్బతో మారన్ సోదరులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మారన్ తరఫున్యాయవాదులు సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని అంటున్నారు.
తమ ఆస్తులను ఎన్ పోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసిందని, స్టే ఇవ్వాలని మారన్ సోదరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం అర్జీ విచారించిన న్యాయస్థానం పిటిషన్ ను కొట్టివేసింది.
ఎయిర్ సెల్- మ్యాక్సిస్ ఒప్పందం విషయంలో మాజీ టెలికాం మంత్రి దయానిధి మారన్ లంచం తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో 2014 ఏప్రిల్ నెలలో దయానిది మారన్, ఆయన సోదరుడు కళానిధి మారన్కు చెందిన రూ. 742 కోట్ల ఆస్తిని ఈడీ అటాచ్ చేసింది.
యుపీఏ ప్రభుత్వంలో టెలికాం శాఖ మంత్రిగా పని చేసిన దయానిధి మారన్ మాక్సిస్ కు చెందిన ఎయిర్ సెల్ సంస్థకు లాభం చేకూర్చడానికి లంచం తీసుకున్నారని కేసులు నమోదు అయ్యాయి. అదే విధంగా చెన్నయ్ కి చెందిన టెలికాం ప్రమోటర్ శివశంకర్ ను షేర్లు విక్రయించాలని మంత్రిగా ఉన్న సమయంలో దయానిధి మారన్ ఒత్తిడి చేశాడని సీబీఐ ఆరోపించింది. ఇప్పటికే కేసు నమోదు చేసి చార్జ్ షీట్ దాఖలు చేశారు.